సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 20: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యాభివృద్ధి జరిగిందని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంజుశ్రీ మాట్లాడారు. ఏ పల్లెలో చూసినా పిల్లలు ఆంగ్లంలో మాట్లాడుతుంటే ఆనందంగా ఉందన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు, పేద విద్యార్థులకు విద్య అందుతున్నదని చెప్పారు. గతంలో అధ్వాన స్థితిలో ఉన్న పాఠశాలలను ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేసిన సీఎం కేసీఆర్కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఒక విజన్తో ముందుకెళుతున్న ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని చెప్పారు.
కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన హ్యాండ్లూమ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక పాలకుడని కొనియాడారు. ఆరోగ్యం, విద్యా రంగాలపై దూర దృష్టితో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో రూ.7 వేల 300 కోట్ల ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకుల విద్యను అభివృద్ధి చేసిన తీరును వివరించారు.
రాష్ట్రంలో ప్రతి రంగంలోనూ అభివృద్ధి జరుగుతున్నదని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. ముఖ్యంగా విద్యారంగంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. అందుకు నిదర్శనం గతంలో జిల్లాలో 7 రెసిడెన్షియల్ పాఠశాలలను ఇప్పుడు 56 రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయడమేనని చెప్పారు. జిల్లాలో మెడికల్, నర్సింగ్, లా కళాశాలల ఏర్పాటు సంతోషకరమన్నారు. జిల్లాలో బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించనున్నట్టు తెలిపారు. అంతకుముందు జిల్లాలో జరిగిన విద్యాభివృద్ధిని డీఈవో వెంకటేశ్వర్లు నివేదించారు. అనంతరం అంతర్జాతీయ స్థాయిలో ఇన్స్పైర్ అవార్డును గెలుచుకున్న కన్సాన్పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని భూమిక, గైడ్ టీచర్ సిద్దేశ్వర్ను అతిథులు ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ కళాశాలల చరిత్రలోనే తొలిసారిగా జాతీయ స్థాయిలో 467వ ర్యాంకు సాధించిన నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి హేమంత్ పవార్, ప్రిన్సిపాల్ కళింగ క్రిష్ణకుమార్ను సన్మానించారు. వరుసగా ఆయా డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులు, అందుకు కృషి చేసిన ఉపాధ్యాయులు, లెక్చరర్లను సన్మానించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, నాగల్గిద్ద జడ్పీటీసీ రాజు రాథోడ్, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్రామ్, ఏడీ విజయ, ఎంఈవో వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి విజయ్కుమార్, వ్యాఖ్యాత డాక్టర్ పూర్ణకృష్ణ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.