సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో ప్రస్తుత ఎండల్లోనూ మంజీరా నదిలో జలసవ్వడి కనిపిస్తున్నది. మెదక్ జిల్లాలో మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టు వనదుర్గా (ఘన్పూర్)కు జలాలు చేరి 21వేల ఎకరాలకు భరోసా కలుగుతున్నది. మంజీరాపై ఎత్తిపోతల ద్వారా మరో 10వేల ఎకరాలకు సాగు నీరంది యాసంగి పంటలు గట్టెక్కుతున్నాయి. సమైక్య పాలకులు సింగూరు ప్రాజెక్టు నీటిని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల తాగునీటి కోసమే తరలించేవారు. దీంతో మెతుకు సీమ రైతుల పంటలకు నీళ్లు అందేవి కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాగా, మంజీరా నదిపై సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మొత్తం 11 చెక్డ్యామ్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో 9 చెక్డ్యామ్ల పనులు పూర్తయి ప్రస్తుతం జలాలతో నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. వీటితో భూగర్భ జలాలు పెరిగి రైతులకు రందిలేకుండా పోయింది.
– దుబ్బాక/కొల్చారం/నారాయణరావుపేట, మార్చి 9
ఇంతటి ఎండల్లోనూ చెరువులు, చెక్డ్యామ్లు, వాగులు జలకళతో ఉట్టిపడుతు న్నాయి. కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను విడుదల చేయడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని హల్దీ, కూడవెల్లి వాగుల్లో జలసవ్వడి నెలకొన్నది. ఇటీవల తొగుట మండలం తుక్కాపూర్ మల్లన్నసాగర్ పంపుహౌస్ నుంచి 12వ ప్యాకేజీ ప్రధాన కాల్వలోకి నీరు విడుదల చేశారు. దీంతో జలాలు సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో నేలతల్లిని ముద్దాడుతూ పక్కనే ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్తున్నాయి. ఈ నీటితో వందలాది చెరువులు, అనేక కుంటలు నిండాయి. సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరంది యాసంగి పంటలు గట్టెక్కుతున్నాయి.
కొల్చారం, మార్చి 9: మండు వేసవిలో సైతం మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. సింగూరు నుంచి నీటిని వదలడంతో యాసంగి పంటలకు నీరు పుష్కలంగా లభిస్తున్నది. మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలో మంజీరా నది నిండుకుండలా కనిపిస్తున్నది. మెదక్ జిల్లాలో మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టు వనదుర్గా (ఘన్పూర్) ప్రాజెక్టు ఆయకట్టు కింద సుమారు 21వేల ఎకరాలకు సింగూరు ప్రాజెక్టు నుంచి విడతల వారీగా ప్రభుత్వం సాగునీటిని విడుదల చేస్తున్నది. మంజీరాపై ఎత్తిపోతల ద్వారా మరో 10వేల ఎకరాలకు సాగు నీరందనున్నది. యాసంగి కోసం ఎనిమిది నుంచి పది విడతల్లో ఏప్రిల్ రెండోవారం వరకు నీటిని విడుదల చేయనుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అప్పట్లో సమైక్య పాలకులు సింగూరు ప్రాజెక్టు నీటిని హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగర వాసుల తాగునీటి కోసం తరలించడంతో యాసంగి, వానకాలం సీజన్లో వనదుర్గా(ఘన్పూర్)ప్రాజెక్టు కింద పంటలు సాగుచేసుకునే రైతన్నలు సాగునీటి కోసం నానాతంటాలు పడేవారు. దీనికితోడు ప్రాజెక్టు నిండా మట్టి పేరుకుపోవడం, కాల్వల తూములు చెడిపోవడంతో చివరి ఆయకట్టు వరకు నీరందక పోయేది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఘనపూర్ ప్రాజెక్టు పునరుద్ధరణపై దృష్టిసారించింది. 2014 డిసెంబర్ 17న సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించి మరమ్మతుల కోసం రూ.100 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో మహబూబ్నహర్, ఫతేనహర్ కెనాల్ కాల్వల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. కాగా, మంజీరా నదిపై సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మొత్తం 11 చెక్డ్యామ్లు మంజూరు కాగా, ఒకటి, రెండు తప్ప మిగతా చెక్డ్యామ్లన్నీ పూర్తయ్యా యి. ఈ క్రమంలో సింగూరు నుంచి నీటిని విడుదల చేయడంతో అన్ని చెక్డ్యామ్లు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. కొల్చారం మండల పరిధిలో ఎనగండ్ల, పైతర చెక్డ్యాంల నిర్మాణం పూర్తి కాగా, కోనాపూర్ అసంపూర్తిగా ఉండిపోయింది. చెక్డ్యామ్లు నిండడంతో భూగర్భ జలాలు పెరిగాయి.
మర్కూక్, మార్చి 9: కొండపోచమ్మ సాగర్ నుంచి తుర్కపల్లి కెనాల్కు (నేడు) శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఈఈ బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొండపోచమ్మ సాగర్ వద్ద కెనాల్ నుంచి నీటిని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎఫ్డీసీ
చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి నీటిని విడుదల చేస్తారని తెలిపారు.
వెల్దుర్తి, మార్చి 9: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో నిర్మించిన కొండపోచమ్మసాగర్ నుంచి వస్తున్న గోదావరి జలాలతో మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హల్దీవాగు ప్రాజెక్టు అలుగు పారుతున్నది. యాసంగి సాగులో భాగంగా వేసిన పంటలు ఎండిపోకుండా రెండేండ్ల నుంచి గోదావరి జలాలను ప్రభుత్వం విడుదల చేస్తున్నది. దీంతో మెదక్ జిల్లలోని వెల్దుర్తి, మాసాయిపేట మండలాల వరప్రదాయిని హల్దీవాగు అలుగు పారుతూ, మత్తడులు దుంకుతున్నది. యాసంగా పంటలు ఎండిపోకుండా చూడాలన్న రైతుల కోరిక మేరకు తెలంగాణ సర్కార్ ఈ ఏడాది సైతం కొండపోచమ్మసాగర్ నుంచి వారం రోజుల క్రితం నీటిని వదిలింది. ఆ నీళ్లు వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లోకి ప్రవేశించడంతో చెక్డ్యాంలన్నీ అలుగుపారుతున్నాయి. ఈ నీళ్లన్నీ హల్దీవాగు ప్రాజెక్టులోకి చేరడంతో ప్రాజెక్టు మత్తడి దూకింది. ఎండలు తీవ్రమవుతున్న పరిస్థితుల్లో గోదావరి జలాలు విడుదల చేయడంపై ఆయా మండలాల రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధిస్తే బంగారు పంటలు పండుతాయన్న సీఎం కేసీఆర్ మాట నిజమైంది. గతంలో ఎండుతున్న పంటలు చూసి దుఖఃలో మునిగిపోయేవాళ్లం. పంటల సాగుఖర్చులు సైతం నష్టపోయాం. ఇప్పుడు ఇంత మండువేసవిలో అడుగకుండానే నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి. మంజీరా పరీవాహక ప్రాంతంతో పాటు ఆయకట్టులో బంగారు పంటలు పండుతున్నాయి. రైతులమంతా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మదన్రెడ్డికి రుణపడి ఉంటాం.
– దొడ్ల ఆంజనేయిలు, తుక్కాపూర్వాసి (మెదక్ జిల్లా)