దుబ్బాక, మార్చి 31: రాఘవ కన్స్ట్రక్షన్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్కు పాల్పడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి తన పదవిని అడ్డుపెట్టుకుని మైనింగ్ అక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు.
నిషేధిత భూముల్లో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడటం చట్ట విరుద్ధమన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొంగులేటి అక్రమాలపై ప్రభుత్వం మౌనంగా ఉండటంపై ఆయన తప్పుపట్టారు. అసెంబ్లీలో పొంగులేటి అక్రమాలపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తే .. సీఎం గొంతు నొక్కారని విమర్శించారు. పొంగులేటికి సీఎంతో పాటు మంత్రులు అండగా ఉండటం సిగ్గు చేటన్నారు. ఈ విషయంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలో చేసింది గోరంత చెప్పేది కొండంతగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్లో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, పేదలతో పాటు అన్ని వర్గాలకు మొండి చేయి చూపిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కోత పెట్టిందన్నారు. శాసనసభ సమావేశంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం, ప్రజల సమస్యలపై ప్రస్తావిస్తే ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. మల్లన్నసాగర్ ఉప కాల్వలు, ఇర్కోడు ఎత్తిపోతల పథకం కోసం నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్రెడ్డికి పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. అనంతరం బీఆర్ఎస్ దుబ్బాక కార్యాలయంలో నియోజకవర్గంలో 156 మంది బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు.
దుబ్బాకలోని ఏటీసీ కేంద్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి ఎల్లమ్మ(రేణుకమాత) దేవాలయంలో రేణుకామాత జమదగ్ని కల్యాణోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బీఆర్ఎస్ దుబ్బాక పట్టణ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఆస యాదగిరి సతీమణిని ఆయన పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ నాయకుల కుటుంబాలకు పరామర్శించారు. ఈ కార్యక్రమాలలో దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీతారవీందర్, బీఆర్ఎస్ నాయకులు రవీందర్రెడ్డి, ఎల్లారెడ్డి, కిషన్రెడ్డి, స్వామి, రాంరెడ్డి, రాజు, శేఖర్గౌడ్ పాల్గొన్నారు.