Siddipet | మద్దూరు(ధూళిమిట్ట), మార్చి 28: ధూళిమిట్ట మండలంలోని లింగాపూర్లో వారంరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు అరిగోస పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గ్రామానికి నీటిని సరఫరా చేసే రెండు బోరుబావుల్లో ఒక్క బోరుబావి ఎండిపోయింది. దీనికితోడు మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు సరిపడకపోవడంతో గ్రామంలో నీటి సమస్య అధికమైంది. నీళ్ల కోసం గ్రామస్తులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన పంచాయతీ అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తుండడం శోచనీయం. గ్రామం లో నాలుగు రోజులుగా జరుగుతున్న బీరప్ప పండుగకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తాగేందుకు నీళ్లు లేక ఇబ్బందులు పడ్డారు. మునుపెన్నడూ గ్రామంలో నీటి సమస్య రాలేదని, వారం రోజులుగా నీళ్ల కోసం అలమటిస్తున్నామని, బావుల వద్దకు వెళ్తున్నామని గ్రామానికి చెందిన తాడెం రాములమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు. మద్దూరు మండల పరిషత్ కార్యాలయానికి నీటి ఇక్కట్లు తప్పడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో వివిధ పంచాయతీలకు చెందిన వాటర్ ట్యాంకర్ల ద్వారా కార్యాలయానికి నీటిని సరఫరా చేస్తున్నారు. కార్యాలయంలో నీటి కొరత ఏర్పడడంతో కార్యాలయ ఉద్యోగులతో పాటు నిత్యం కార్యాలయానికి వచ్చే సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు.