మెదక్ మున్సిపాలిటీ/ నర్సాపూర్/ రామాయంపేట/ నిజాంపేట/ తూప్రాన్, జనవరి 27 : పేద వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రం మెదక్లోని 19, 21వ వార్డుల్లో కొ నసాగుతున్న కంటి వెలుగు శిబిరాలను కౌన్సిలర్లు జయరాజ్, నిర్మలతో కలిసి సందర్శించారు. రెండు వార్డుల్లో 228 మంది కంటి పరీక్షలు చేయించుకోగా 113 మందికి అద్దాలు అందజేశామని, 94 మందికి ప్రిస్కిప్షన్ రాసి ఇచ్చినట్లు మెదక్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యుడు మణికంఠ తెలిపారు.
ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి
నర్సాపూర్ మండలంలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామస్తులు కంటి వెలుగు శిబిరాలకు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. మంతూర్ గ్రామంలోని కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీడీవో మార్టీన్ లూథర్ సందర్శించి, కంటి పరీక్షల వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మార్టీన్ లూథర్ మాట్లాడుతూ తిర్మలాపూర్, గొల్లపల్లి, ఎల్లారెడ్డిగూడ తండాల్లో కంటి పరీక్షలు పూర్తయ్యాయన్నారు. తిర్మలాపూర్లో 227 మంది, ఎల్లారెడ్డిగూడ తండాలో 314 మంది, గొల్లపల్లిలో 320 మందికి కంటి పరీక్షలు చేసినట్లు వివరించారు. మంతూర్, ఎర్రగుంటతండాలో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో రెడ్డిపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ రఘువరుణ్, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య బృందం పాల్గొన్నారు.
కంటి వెలుగు శిబిరాల పరిశీలన
రామాయంపేట మున్సిపల్లోని కోమటిపల్లి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, కమిషనర్ యాదగిరి ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యురాలు లావణ్య, మేనేజర్ శ్రీనువాస్, కౌన్సిలర్ సుందర్సింగ్, వార్డు ఆఫీసర్ శ్రీనివాస్, సూపర్వైజర్ సునంద పాల్గొన్నారు.
నందిగామలో ముగిసిన శిబిరం
నిజాంపేట మండలంలోని నందిగామలో చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా హెచ్ఈవో చారి మాట్లాడుతూ.. గ్రామంలో 746 మంది దృష్టిలోపం సమస్యతో బాధపడుతుండగా 660 మంది కంటివెలుగు శిబి రానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. 174 మందికి అద్దాలు అందజేశామని, 56 మందికి శస్త్రచికిత్స అవసరమన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్, వైద్యులు సాయికృష్ణ, శుశాంత్, ఏఎన్ఎం సలోమి, ఆశవర్కర్ గౌరి, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.
విజయవంతంగా ‘కంటి’ పరీక్షలు
తూప్రాన్ మున్సిపల్లో ‘కంటి వెలుగు’ విజయవంతంగా కొనసాగుతున్నది. తూప్రాన్లోని 6వ వార్డులో ఉన్న ఆయుర్వేద దవాఖానలో నిర్వహిస్తున్న ‘కంటి వెలుగు’ శిబిరంలో 118 మందికి పరీక్షలు నిర్వహించగా, 25 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 17 మందికి శస్త్ర చికిత్స అవసరమని నిర్థారించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆనంద్, వైద్యులు రుక్సానా, బాల్నర్సయ్య పాల్గొన్నారు.