సంగారెడ్డి, మే 22: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి క్రీడాకారుడు గెలుపుకోసం పట్టుదలతో ఆడాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. సోమవారం సీఎం కప్-2023 జిల్లాస్థాయి క్రీడలను ఆయన జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్తో కలిసి ప్రారంభించారు. ముందుగా క్రీడాజ్యోతిని వెలిగించి మైదానంలో క్రీడాకారులకు అందించారు. క్రీడాకారుల నుంచి వందన స్వీకరించి, క్రీడా పతకాన్ని ఆవిష్కరించారు. శాంతి కపోతాలను ఎగెరవేసి, క్రీడల నగారా మోగించారు.
అనంతరం క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ముందుగా కొండాపూర్-కల్హేర్ కబడ్డీ జట్ల మధ్య పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో విజయం సాధించి, జిల్లాస్థాయి క్రీడల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొని, జిల్లా కీర్తిని చాటిచెప్పాలన్నారు. రాష్ట్రస్థాయిలో పాల్గొనే జట్లను ఉత్తమ ఆటతీరు కనబర్చిన క్రీడకారులను ఎంపిక చేసి పంపాలన్నారు. జిల్లా నుంచి క్రీడకారులు బెస్ట్ ఆప్ ది బెస్ట్గా రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదన్నారు. అందుకోసం ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలోని 687 గ్రామ పంచాయతీల్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిందన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడా ప్రాంగణాలు ఉపయోగపడుతాయన్నారు.
క్రీడల ముగింపునకు మంత్రి హరీశ్రావు రాక..
సీఎం కప్-2023 జిల్లా స్థాయి పోటీల ప్రారంభానికి మంత్రి హరీశ్రావు హాజరు కాలేకపోయారు. అనివార్య కారణాలతో రాలేకపోతున్నట్లు క్రీడాకారులకు చెప్పాలని తనకు చెప్పినట్లు కలెక్టర్ శరత్ అన్నారు. క్రీడల ముగింపు రోజు ఈ నెల 24న తప్పకుండా మంత్రి వస్తానని చెప్పినట్లు వివరించారు. కార్యక్రమంలో సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, భూపాల్రెడ్డి, మాణిక్యరావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లత, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడకారులు తదితరులు పాల్గొన్నారు.