పెద్దశంకరంపేట, సెప్టెంబర్ 19: పెద్దశంకరంపేటకు త్వరలో కాళేశ్వర జలాలు అందించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పట్టణ శివారులో నిర్మించిన 96 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం నీటితో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. పెద్దశంకరంపేట మండలంలోని ప్రతి ఎకరాకు గోదావరి జలాలు అందజేస్తామన్నారు. మండలంలోని బీడు భూములన్నీ కాళేశ్వరం నీటితో సాగు భూములుగా చేసి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చేందేందుకు కృషి చేస్తామన్నారు. కాళేశ్వరం నీటిని అందించే పైపులైన్ పనులు నర్సాపూర్ వరకు పూర్తయ్యాయని, తొందరలోనే ఈ ప్రాంతానికి పైపులైన్లు ద్వారా గోదావరి నీటిని అందించి చెరువులు, కుంటలు నింపుతామన్నారు. రైతుల ముఖాల్లో సంతోషం చూడడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఆదిశగా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పట్టించుకోకపోవడంతో రైతులు వలస వెళ్లారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లోని చెరువులు కుంటల్లో పుష్కలంగా నీరు చేరడంతో రైతులు మళ్లీ తమ సొంత గ్రామాలకు తిరిగొచ్చి, వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడుతున్నారన్నారు.
ఎమ్మెల్యేగా భూపాల్రెడ్డి హ్యాట్రిక్ ఖాయం
నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూపాల్రెడ్డి హ్యాట్రిక్గా గెలుపొందడం ఖాయమని, భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో నారాయణఖేడ్ ప్రాంతంలో కేసులు, కొట్లాటలు మాత్రమే ఉండేవని, అభివృద్ధి శూన్యమన్నారు. ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గెలుపొందాక ఖేడ్ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. నిరంతరం జనంలో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుంటూ ప్రజల ఆదరాభిమనాలు పొందిన నాయకుడు భూపాల్రెడ్డి అని కొనియాడారు. తనని ఎప్పుడు కలిసినా ఈ ప్రాంతంలో రహదారులు, సీసీరోడ్లు, విద్య, వైద్యం తదితర రంగాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతుంటాడన్నారు. ఇలాంటి నాయకుడని మరోసారి గెలిపించుకోవాలన్నారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
పెద్దశంకరంపేట పట్టణ శివారులో రూ.1.20 కోట్లతో అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ మీదుగా పాల కేంద్రం వరకు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలోని కట్టెల వెంకటాపురం శివారులో జాతీయ రహదారి నుంచి గ్రామం వరకు 3 కిలోమీటర్ల మేర బీటీ పనులకు రూ.2.94 కోట్లతో నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. పెద్దశంకరంపేట శివారులో రూ.5.64 కోట్లతో నిర్మించిన 96 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభించారు. మండలంలో గృహలక్ష్మి పథకం కింద 350 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.
మార్కెట్యార్డుగా మారుస్తాం
పెద్దశంకరంపేట శివారులోని వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డును ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, స్థానిక నాయకుల కోరిక మేరకు పూర్తిస్థాయిలో మార్కెట్ యార్డుగా మారుస్తామని మంత్రి హరీశ్రావు హమీ ఇచ్చారు. రైతులు పండించిన ప్రతి పంటకూ ప్రభుత్వమే మద్దతు ధర చెల్లిస్తూ కొంటున్నదన్నారు. పెద్దశంకరంపేటలో గీతా పారిశ్రామిక సహకార సంస్థ మాజీ చైర్మన్ విగ్రాం రామాగౌడ్ సేవలు చిరస్మరనీయమన్నారు. రామాగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్, పీఆర్ ఈఈ సత్యనారాయరెడ్డి, డీఈ శ్రీనివాస్, డీపీఆర్వో ఏడుకొండలు, మెదక్ ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేశ్, ఎంపీటీసీలు దత్తు, సుభాష్గౌడ్, వేణుగోపాల్గౌడ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీలు కాదు.. ఆర్నెళ్లకో సీఎం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు కాదు, ఆరు నెలలకోసారి సీఎం మారుతుంటారని, ఆరు గంటల కరెంట్ మాత్రమే ఉంటుందని మంత్రి హరీశ్రావు అన్నారు. వారి సీఎం పేరు ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లో రావాలని, వారు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు పదవిలో నుంచి పోతారో కూడా తెలియదని విమర్శించారు. పరిశ్రమలకూ రెండు పవర్ హలీడేలు ఉంటాయన్నారు. తెలంగాణ రెండో రాజధాని బెంగళూరును చేస్తారని, ఢిల్లీకి వెళ్లాలంటే బెంగళూరు మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో కాలిపోయిన మోటర్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు ఉండేవన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు సంతకం లేని చెక్కు లాంటివని, ఆ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. 60 ఏండ్లలో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేండ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందన్నారు. సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలువడంతోపాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు రైతుబీమా, రైతుబంధు, కేసీఆర్ కిట్టు, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఉచిత కరెంటు, ఇంటింటికీ మిషన్ భగీరథ మంచినీళ్లు అందజేస్తున్నామన్నారు. ఇంటింటికీ నీళ్లివ్వకుంటే ఓట్లు అడగనని సీఎం కేసీఆర్ చెప్పి, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికీ నీళ్లు అందిస్తున్నామన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న కర్ణాటకలో మన తెలంగాణ పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.600 పింఛన్ ఇస్తున్నదని, ఇక్కడ తప్పుడు ప్రచారం చేస్తూ అధికారంలోకి రావాలని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్స్ మ్యానిఫెస్టో త్వరలో వస్తుందని, అద్భుతంగా ఉంటుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
సొంతింటి కల నెరవేరింది
ఎన్నో ఏండ్లుగా సొంతింటి కోసం ఎదురు చూశాం. 40 ఏండ్లుగా నా భర్త టైలరింగ్ పని చేస్తున్నాడు. ఈ వృత్తిలో మా పిల్లలను చదివించుకోవడం, ఇంటి అద్దె చెల్లించడం కష్టంగా ఉంది. ఈ రోజు రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇంటి పట్టా చేతికి రావడంతో ఆనందంగా ఉంది. సొంతింటి కల నెరివేరింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి కృతజ్ఞతలు.
– సంగేవార్ రత్నమ్మ, పెద్దశంకరంపేట
సీఎం కేసీఆర్ సారు సల్లగుండాలి
మధ్య తరగతి కుటుంబంలో సొంతిల్లు కట్టుకోవడం ప్రస్తుతం ఎంతో కష్టతరమైంది. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించిన సీఎం కేసీఆర్ సారు సల్లంగా ఉండాలి. తాను దివ్యాంగురాలు అయినా ఏ పని చేసుకోవాలన్నా కష్టంగా ఉండేది. మాకు సొంతిల్లు రావడంతో మా కుటుంబంలో సంతోషం నిండింది. మంత్రి, ఎమ్మెల్యే సార్లకు ధన్యవాదాలు.
– చందుబట్ల అనురాధ, పెద్దశంకరంపేట
పైసా ఖర్చు లేకుండా సొంతిల్లు
పైసా ఖర్చు లేకుండా తెలంగాణ ప్రభుత్వం మాకు సొంతిల్లు అందజేసింది. 40 ఏండ్లుగా ఆయా ప్రభుత్వాలకు ఓటేసినా ఎవరూ పట్టించుకోలేదు. సొంత ఇంట్ల ఉంటమని అనుకోలేదు. మాకు సొంతిల్లు అందజేసిన సీఎం కేసీఆర్కు మా కుటుంబమంతా రుణపడి ఉంటుంది. మా కల నెరవేర్చి, మా జీవితం లో ఆనందం నింపిన మంత్రి హరీశ్రావుకు, ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి ధన్యవాదాలు.
– ఇస్మాయిల్ భారతి, పెద్దశంకరంపేట