చిన్నకోడూరు, ఆగస్టు 3: నులిపురుగులను నివారిద్దామని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన చిన్నకోడూరులోని జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం నిర్వహించిన జాతీయ నులిపురుగుల దినోత్సవానికి ఎంపీపీ కూర మణిక్యరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి హరీశ్రావు కృషితో పేదలకు మెరుగైన వైద్యం అందుతున్నదన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లల కోసం 1 నుంచి 19 ఏండ్ల వయస్సు గల పిల్లలు నులిపురుగుల మాత్రలను తప్పకుండా వేసుకోవాలన్నారు. నులి పురుగుల బారిన పడిన పిల్లలు పోషకాహార లోపం, రక్తహీనతలతో బాధపడుతుంటారన్నారు. శారీరక, మానసిక అభివృద్ధి మందగిస్తుందన్నారు. డాక్టర్ సరిత, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఉమేశ్చంద్ర, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
న్యాల్కల్, ఆగస్టు 3: పిల్లల్లో నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంగారెడ్డి డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శంకర్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండలంలోని హద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు తప్పకుండా మాత్రాలు వేయించాలని సూచించారు. పిల్లలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఇలాంటి వ్యాధులు సోకవన్నారు. మండలంలోని మిర్జాపూర్(బి), న్యాల్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది కలిసి పిల్లలకు మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఏరియా దవాఖాన సీహెచ్వో రవికుమార్, హెల్త్ అఫీసర్ విజయలక్ష్మి, డాక్టర్లు నృపేన్చక్రవర్తి, శ్వేతాప్రియ, గణపతిరావు, వైద్య సిబ్బంది శ్యామల, మొగులయ్య, మల్లికార్జున్, మార్త, హద్నూర్ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అర్జున్, ఏఎన్ఎంలు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.