నర్సాపూర్, ఆగస్టు 29: ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు దవాఖానలను బలోపేతం చేసి ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారు. అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వ దవాఖానల్లోలోనే అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా తీర్చిదిద్దుతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో 100 పడకల ఏరియా దవాఖానలో వైద్యులు రోగులకు మెరుగైన వైద్యం అందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రసవాల సంఖ్య పెంచడంలో నర్సాపూర్ ఏరియా దవాఖాన దూసుకుపోతున్నదని చెప్పవచ్చు. గర్భిణులు ప్రతి నెలా ప్రభుత్వ దవాఖానకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. తల్లీబిడ్డల సంక్షేమమే ధ్యేయంగా వైద్యులు మెరుగైన సేవలను అందిస్తూ డెలివరీలు చేస్తున్నారు. అనంతరం కేసీఆర్ కిట్లను అందజేస్తున్నారు.
ఈ దవాఖానలో గర్భిణులకు అన్ని రకాల వసతులు కల్పించారు. సీఎం కేసీఆర్ చొరవతో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కృషితో లేబర్ రూమ్ల్లో సకల సౌకర్యాలు కల్పించారు. ఈ ప్రభుత్వ దవాఖానలో అత్యాధునిక పరికరాలతో రోగులకు మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. ఎక్స్రే, ఈసీజీ, ఆపరేషన్ థియేటర్, ఆక్సిజన్ సిలిండర్లు, ఫిజియో థెరఫీ, బేబీ వార్మర్ తదితర సౌకర్యాలు దవాఖానలో కలవు.
పెరుగుతున్న ప్రసవాల సంఖ్య..
నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా దవాఖానలో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో ప్రసవాల సంఖ్య ప్రతి నెలా పెరుగుతున్నది. ఈ సంవత్సరం జనవరి నుంచి జూలై వరకు 857 ప్రసవాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 484 నార్మల్, 373 ఆపరేషన్ డెలివరీలు చేశారు. జనవరిలో నార్మల్ డెలివరీలు 67, ఆపరేషన్ డెలివరీలు 41, ఫిబ్రవరిలో నార్మల్ 63, ఆపరేషన్ 57, మార్చిలో నార్మల్ 86, ఆపరేషన్ 57, ఏప్రిల్లో నార్మల్ 57, ఆపరేషన్ 54, మేలో నార్మల్ 72, ఆపరేషన్ 63, జూన్లో నార్మల్ 58, ఆపరేషన్ 60, జూలైలో అత్యధికంగా నార్మల్ డెలివరీలు 81, ఆపరేషన్ డెలివరీలు 41 చేశారు. ప్రసవాల అనంతరం బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశారు.
జనవరి నుంచి జూలై వరకు 704 కేసీఆర్ కిట్లను అందజేసినట్లు అధికారులు తెలిపారు. జనవరిలో 88, ఫిబ్రవరిలో 100, మార్చిలో 108, ఏప్రిల్లో 104, మేలో 110, జూన్లో 104, జూలైలో 90 కేసీఆర్ కిట్లను అందజేశారు. వీటితో పాటు ప్రభుత్వ దవాఖానలో ప్రసవించిన గర్భిణులకు ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుండడంతో సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య మరింత పెరుతున్నది.