పటాన్చెరు, మార్చి 10: జాతీయ రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ద్విచక్రవాహనదారులు భయంభయంగా ప్రయాణం సాగిస్తున్నారు. 65వ నంబర్ హైవేపై రోడ్డుపక్కన ఏర్పడిన దుమ్ము, దూళి, మట్టి రహదారిని ఆక్రమిస్తున్నది. రోడ్డుపై ఉన్న ఇసుక ఎగిరి ప్రయాణికుల కండ్లలో పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో పలువురు తీవ్రగాయాలపాలు కాగా, కొందరు ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.
పటాన్చెరు పట్టణం నుంచి ఇస్నాపూర్ చౌరస్తా వరకు ముంబై జాతీయ రహదారి నిర్వహణ వైఫల్యంతో రోడ్డుకు ఇరువైపులా ఇసుక, మట్టి, కంకర రాళ్లు పేరుకుపోయాయి. రోడ్డుపై 10ఫీట్ల వరకు మట్టి, ఇసుక కనిపిస్తున్నది. ద్విచక్ర వాహనదారులు ఆ మట్టి, ఇసుకలో అదుపుతప్పి కిందపడిపోవడం సాధారణంగా మారింది.
పోచారం చౌరస్తానుంచి నక్కవాగు వర కు ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి. స్వీట్హాట్ హోటల్నుంచి హరి దోశ సెంటర్ వరకు రోడ్డు గుంతలమయమైంది. ఇసుక పేరుకుని పోవడంతో వాహనదారులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతు న్నారు.
ముత్తంగి గ్రామ సమీపంలో, పెట్రోల్ పంపు వద్ద, ముత్తంగి చర్చి ముందు ఇసుక దిబ్బలు దర్శనమిస్తున్నాయి. వీటి కారణంగా వాహనదారుల కండ్లలో ఇసుక, మట్టి, దు మ్ము పడటంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇస్నాపూర్ ఆంధ్రాకాలనీ నుంచి గురుకుల పాఠశాల, లక్డారం గేటు వరకు మట్టితో రోడ్డు కమ్ముకుపోయింది. లక్డారం గేటు వద్ద క్రషర్ల నుంచి వచ్చే వాహనాలతో జాతీయ ర హదారిపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రోడ్ల పై కంకర పడటంతో అధ్వానంగా మారాయి.
పటాన్చెరు పట్టణంలో రిలయన్స్ పెట్రోల్ పంపు ఎదుట రెడీమిక్స్ వాహనాల వల్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. పోచారం చౌరస్తాలో నిర్మాణ కంపెనీలకు సంబంధించిన వాహనాల్లో వస్తున్న మట్టి, కంకర, ఇసుక జారిపడి రోడ్డును సగం ఆక్రమించాయి. రోడ్డు అధ్వానంగా మారుతున్న సంబంధిత అధికారులు మరమ్మతులకు ఆసక్తి చూపకపోవడం, రహదారి నిర్వహణను పట్టించుకోకపోవడం తో ప్రమాదాలు జరుగుతున్నాయి. త్వరలోనే జాతీయ రహదారి విస్తరణ ఉంటుందని చెబు తూ మరమ్మతులు చేయడం లేదు.