హత్నూర, ఏప్రిల్ 4: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో బుధవారం జరిగిన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తమవారి మృతదేహాల కోసం బాధిత కుటుంబీకులు పరిశ్రమ ఎదుట 16గంటల పాటు నిరీక్షించారు. తమవారి మృతదేహాలను చూపించాలని వేడుకున్నా ఎవరూ స్పందించకపోవడంతో పరిశ్రమ ఎదుట బుధవారం సాయంత్రం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ఆర్తనాదాలు చేస్తూ నిరీక్షించారు. పరిశ్రమలో జరిగిన ప్రమాద విషయం తెలుసుకోవడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశ్రమ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబీకులు మాత్రం తమవారి ఆచూకీ తెలియక బోరున విలపిస్తూ మృతదేహాల కోసం పడిగాపులు కాశారు.
మృతదేహాలను ఎక్కడికి తరలించారో కూడా తెలియని పరిస్థితిలో ఇతర రాష్ర్టాల కార్మికుల కుటుంబ సభ్యులు అయోమయానికి గురయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎక్కడికి తరలించారో తెలియక ఆందోళన చెందారు. మృతదేహాలను తమకు అప్పగించాలని, మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని బాధిత కుటుంబీకులు, స్థానికులు డిమాండ్ చేస్తూ సంగారెడ్డి-నర్సాపూర్ ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ధర్నాతో భారీసంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. పోలీసులు జోక్యం చేసుకుని బాధిత కుటుంబాలకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. వారు వినకపోవడంతో ఓ దశలో పోలీసులు, బాధిత కుటుంబీకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కల్పించుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొన్యాల గ్రామానికి చెందిన వడ్డేపల్లి రమేశ్ బుధవారం ఎస్బీ పరిశ్రమలో విధులకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. గురువారం పరిశ్రమలో శిథిలాల కింద రమేశ్(32) మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించి బోరున విలపించారు.
బుధవారం ఎస్బీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో కార్మికుడు దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. మరో కార్మికుడి మృతదేహం పరిశ్రమ శిథిలాల కింద గురువారం లభ్యమైంది. దీంతో పరిశ్రమలో మృతిచెందిన వారిసంఖ్య ఆరుకు చేరింది. మరో ఏడుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్కు చెందిన పరిశ్రమ డైరెక్టర్ రవిశర్మ, సురేశ్ పాటిల్ (మధ్యప్రదేశ్), దయానంద్ (తమిళనాడు), సుబ్రహ్మణ్యం(ఆంధ్రప్రదేశ్), చందాపూర్ గ్రామానికి చెందిన చాకలి విష్ణు బుధవారం మృతిచెందారు. గురువారం కొన్యాలకు చెందిన కార్మికుడు వడ్డ్డేపల్లి రమేశ్ మృతదేహం లభ్యమైంది.