దశాబ్దాలుగా భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ధరణి పోర్టల్ వరంలా మారింది. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్, పౌతి,నాలా, భూ పంపకం సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో విజయవంతంగా అమలవుతున్నది. ఉమ్మడి పాలనలో ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా జరగని పనులు నేడు బీఆర్ఎస్ సర్కారు పాలనలో త్వరితగతిన, పారదర్శకంగా పూర్తవుతున్నాయి. మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుని తహసీల్ కార్యాలయానికి వెళ్తే ఇటు రిజిస్ట్రేషన్తో పాటు మ్యుటేషన్ రెండు పనులు ఒకేసారి అయిపోతున్నాయి. ఆ వెంటనే అధికారులు కొత్త పాస్బుక్ను రైతుకు అందజేస్తున్నారు. దళారుల ప్రమేయం లేకుండా, రెవెన్యూ సిబ్బంది చేతివాటానికి కళ్లెం వేస్తూ ధరణి అందుబాటులోకి రావడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 1,12,254, సంగారెడ్డి జిల్లాలో గత రెండేండ్లలో 1,08,144పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.
మెదక్, మే 29(నమస్తే తెలంగాణ): భూ సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ను 2020లో అందుబాటులోకి తీసుకువచ్చింది. సీఎం కేసీఆర్ పోర్టల్ను ప్రారంభించి మూడేండ్లు కావస్తున్నది. పైసా లంచం ఇవ్వకుండా భూముల సమస్యలకు శాశ్వత పరిషారాన్ని చూపడంతో పాటు మార్పులు, చేర్పులు అన్నీ ఆన్లైన్లో చేసుకునేలా ఈ వెబ్పోర్టల్ను రూపొందించారు. దీంతో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. తాజాగా, ధరణిలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల పరిషారం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, పాసు పుస్తకాల జారీ, వారసత్వ బదిలీలు తదితర పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. మెదక్ జిల్లాలో 75,363 రిజిస్ట్రేషన్లు, 15,008వేల గిఫ్ట్ డీడ్, 12,891వేల పౌతి, 8992 మార్టిగేజ్ మొత్తం 1,12,254 రిజిష్ర్టేషన్లు అయ్యాయి. అంతేకాకుండా భూ సమస్యల పరిషారానికి ఎప్పటికప్పుడు కొత్త మాడ్యూల్స్ను అధికారులు అందుబాటులోకి తెస్తున్నారు. ధరణితో భూ సమస్యలు చకచకా పరిషారమవుతుండడంతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ధరణి వేదికగా శరవేగంగా మ్యుటేషన్లు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు పరిషారమవుతున్నాయి. ఉమ్మడి పాలనలో రెండు, మూడు నెలల్లో అయ్యే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేడు 15 నిమిషాల్లోనే పూర్తవుతున్నది. ధరణి పోర్టల్ వేదికగా మ్యుటేషన్లు శరవేగంగా సాగుతున్నాయి. గతంలో భూదందాలతో ఎంతో మంది పట్టాదారులు సమస్యల్లో ఇరుకుపోయారు. అలాంటి ఎంతో మందికి ‘ధరణి’ పరిషారం చూపుతున్నది. మెదక్ జిల్లాలో భూ సమస్యలు లక్షల్లో ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ‘ధరణి’ పోర్టల్తో వాటన్నింటికీ చెక్ పెట్టింది.
ఎన్నారైలకు ఎంతో వెసులుబాటు…
ఇప్పటివరకు జఠిల సమస్యగా ఉన్న ఏజీపీఏ, ఎస్పీఏలలో స్టాంపు డ్యూటీ అడ్జెస్ట్మెంట్ సేవలను ధరణి పోర్టల్లో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రత్యేక ఆప్షన్తో ఎన్నారైలకు ఎంతో వెసులుబాటు కలుగనుంది. ఈ మేరకు జీవో 26ను జారీ చేసి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు కలెక్టరేట్లలోని ధరణి సహాయక కేంద్రాలు, మీ సేవల్లో రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యల పరిషారం, సమాచారం కోసం సంప్రదిస్తున్నారు. అయితే, అవగాహనలేమితో తప్పుడు ఆప్షన్లో దరఖాస్తు చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు తలెత్తాయి. దీంతో, రైతాంగం తమ సమస్యలను పరిషరించుకోలేకపోయారు. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంలో తమ సమస్యను ధరణిలోని మాడ్యూల్లో నమోదు చేయగానే సమస్య పరిషారం ఎలా.. ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలి.. ఏఏ పత్రాలు జత చేయాలి అనే వివరాలను సూచిస్తుండడంతో ఎన్నారైలు సులభంగా భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు.
ధరణితో ఎంతో మేలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ విజయవంతంగా కొనసాగుతున్నది. ధరణిలో సమస్యలు వేగవంతంగా పరిష్కారమవుతున్నాయి. సులభతరంగా, పారదర్శకంగా లావాదేవీలు జరుగుతున్నాయి. భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఎంతో మందికి ధరణి మేలు చేస్తున్నది. స్లాట్ బుకింగ్ల నుంచి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, పాసు పుస్తకాలు అందజేయడం చకచకా జరుగుతున్నాయి. ధరణిలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదు. జిల్లాలో ఇప్పటివరకు 75,363 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.
– రాజర్షి షా, కలెక్టర్, మెదక్
15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్
మెదక్ తహసీల్ కార్యాలయంలో 6025 రిజిస్ట్రేషన్లు చేశాం. 2235 సేల్ డీడ్లు, 1887 గిఫ్ట్ డీడ్లు, పౌతి 675, పెండింగ్ మ్యుటేషన్లు 362, మార్టిగేజ్ 291, పార్టిషన్ 62, నాలా కన్వర్షన్ 343లు చేశాం. ధరణి పోర్టల్తో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
-కె.శ్రీనివాస్, తహసీల్దార్, మెదక్
తిప్పలు తప్పినయ్..
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో తిప్పలు పోయినయ్. గతంలో భూ సమస్యల పరిష్కారానికి ఏండ్ల తరబడి కార్యాలయాల చూట్టు తిరిగినా పని మాత్రం అయ్యేది కాదు. ధరణితో ఎలాంటి పనైనా సులభంగా అయిపోతున్నది. ఏ అధికారినీ బతిమిలాడాల్సిన అవసరం లేకుండా మీ సేవలో స్లాట్ బుక్ చేసుకొని వెళితే నిమిషాల్లో పనులు జరుగుతున్నాయి. ధరణి పోర్టల్తో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. పైసా లంచం ఇవ్వకుండా భూముల రిజిస్ట్రేషన్లు, పట్టాపాస్ పుస్తకాల్లో మార్పులు, చేర్పులు జరిగిపోతున్నాయి. రైతుల భూములకు రక్షణ కవచంగా నిలుస్తున్న ధరణిని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– కె.నర్సింలు, రైతు, చిద్రుప్ప గ్రామం, కంది మండలం