సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 8: ధరణిలో వివిధ మాడ్యూల్స్లో వచ్చిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ రెవెన్యూ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించి ధరణి ఫైల్స్ పరిష్కారం, భూసేకరణ, భూ సమీకరణ పురోగతి, జీవో 59 తదితర అంశాలపై కలెక్టర్ మండలాల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవో 59 కింద లబ్ధిదారులు నిబంధనల మేరకు చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని చెల్లించేలా చర్యలు చేపట్టాలని, ఆ చెల్లించిన వెంటనే ఇంటి స్థలం రిజర్వేషన్ చేయించి దస్తావేజులు అందించాలన్నారు. జీవో 59 కింద 471 మంది లబ్ధిదారులకు 212 మంది పూర్తిగా చెల్లించారని, వారికి దస్తావేజులు అందించామన్నారు.
వివిధ అభివృద్ధి పనులకు కావాల్సిన భూ సేకరణ, భూ సమీకరణ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గతంలో ఇండ్ల కోసం భూమి సేకరించి, కేటాయించకుండా ఉన్న భూ వివరాలను అందించాలని తహసీల్దార్లను ఆదేశించారు. అనంతరం రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పాల్గొని మహిళా ఉద్యోగులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవోలు, తహసీల్దార్లు, కలెక్టరేట్ ఏవో తదితరులు పాల్గొన్నారు.