జహీరాబాద్, ఏప్రిల్ 10 : బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కుటుంబ సభ్యులుగా సమన్వయంతో కలిసి పని చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. సోమవారం ఝరాసంగంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాణిక్రావు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా మారిందని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు తాగునీటి కోసం మహిళలు వ్యవసాయ బావులు, వాగులకు వెళ్లి తీసుకవచ్చే వారని, రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగరీథ పథకంతో ఇంటింటికీ నల్లానీరు అందిస్తున్నారని చెప్పారు. కాళేశ్వరంతో సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ సరఫరా చేయడంతో పంట పెట్టుబడి కూడా ప్రభుత్వమే అందజేస్తున్నదని, ఇలాంటి పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు మాతా శిశు దవాఖాన ఏర్పాటు చేశామని తెలిపారు. బస్తీ దవాఖానలు ఏర్పాటు సర్కారు వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారన్నారు. పేద విద్యార్థులకు ఆంగ్ల విద్యాబోధన చేసేందుకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. అర్హులైన ప్రతి ఒకరికీ గృహలక్ష్మిలో ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. నియోజకవర్గంలో రూ.51 కోట్లుతో బీటీ రోడ్లులకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. పార్టీలో చురుకుగా పాల్గొనే వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచయ్యస్వామి, నాయకులు సుభాశ్రావు, సంగమేశ్వర్, నర్సింలు, పండరి, నర్సింలుగౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి : మాల్కాపూరం శివకుమార్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్
బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని, ప్రజలు ఎన్నికల్లో బీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మాల్కాపూరం శివకుమార్ అన్నారు. ఝరాసంగం మండలంలో తాగునీటి కొరత ఉన్నదని, ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష చేసి సమస్య పరిష్కరించాలన్నారు. అధికారులు తాగునీటి సమస్య పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కేతకీ సంగమేశ్వర్ స్వామి ఆశీస్సులతో ఝరాసంగానికి చెందిన స్థానికుడు మాణిక్రావు ఎమ్మెల్యే అయ్యారని, మరోసారి ఆయనను గెలిపించే బాధ్యత తీసుకోవాలన్నారు. మంత్రి హరీశ్రావు సహకరంతో అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ రైతు ప్రభుత్వం : ఉమాకాంత్ పాటిల్, సీడీసీ చైర్మన్ జహీరాబాద్
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ అన్నారు. కార్యకర్తలు, నాయకులకు పార్టీలో తగిన గుర్తింపు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు ప్రజలకు అందుబాటులో ఉంటూ, మంత్రి హరీశ్రావు సహకారంతో మండలంలోని సమస్యలు పరిష్కరించారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
ఆత్మీయ సభ అదుర్స్..
ఝరాసంగంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ను కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయ ప్రధాన ద్వారం నుంచి వాసవి ఫంక్షన్హాల్ వరకు భారీర్యాలీ నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో స్వాగతం పలుకుతూ కార్యకర్తలు క్రేన్ సహాయంతో భారీ గజమాలను ఎమ్మెల్యే మాణిక్రావుకు వేశారు. మండలంలోని 16 గ్రామాలకు చెందిన కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు.