సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 30 : విధి నిర్వహణలో అలసత్వం వహించకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాయంతోపాటు జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్ను ఉమెన్ సెఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ శిఖాగోయల్, రాజన్న జోన్ డీఐజీ రమేశ్నాయుడు, సిద్దిపేట సీపీ శ్వేతతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో డీజీపీ అంజనీకుమార్ జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారాలని, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ప్రతి ఒక్క అధికారి అందిపుచ్చుకోవాలన్నారు. పోలీస్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు.
కమ్యూనిటీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఏ ఒక్క పోలీసు చిన్న తప్పు చేసినా మొత్తం డిపార్ట్మెంట్ మీద పడుతుందని, ప్రతిఒక్కరూ ఆలోచించుకొని విధులు నిర్వహించాలని సూచించారు. ఆత్మగౌరవం, క్రమశిక్షణ, పారదర్శకతతో విధులు నిర్వహించాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సంబంధిత పోలీస్ అధికారులు ప్రతిరోజూ గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమై ప్రజల రక్షణకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. క్రైమ్ రేట్ తగ్గించే విధంగా ప్రతిఒక్కరూ ఒక కుటంబం లాగా కలిసి పని చేయాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా ఛేదించి సరైన సమయంలో చార్జి షీట్ వేయాలన్నారు.
ప్రభుత్వం అధునాతన వాహనాలు అందించిందని, ప్రజల రక్షణ, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ చాలా ముఖ్యమన్నారు. ఒక సబ్ డివిజన్ స్థాయి నుంచి ఒక కమిషనరేట్ను ఏర్పాటు చేసుకోవడం చాలా అదృష్టమని, పోలీస్ కమిషనరేట్ను అద్భుతంగా, ఆధునిక టెక్నాలజీతో నిర్మించామన్నారు.. పచ్చదనం, పరిశుభ్రత ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందని సీపీ శ్వేతను, అధికారులను, సిబ్బందిని డీజీపీ అభినందించారు. పోలీస్ కన్వెన్షన్ సెంటర్ను కూడా రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అద్భుతంగా నిర్మించామన్నారు. విశాలమైన హాల్, విశాలమైన పార్కింగ్తో ఆహ్లాదకరంగా ఉందన్నారు. అనంతరం సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత జిల్లా భౌగోళిక పరిస్థితులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధి, జరుగుతున్న నేరాలు, బార్డర్ పోలీస్ స్టేషన్లు, జిల్లాలో నూతనంగా నిర్మించిన ప్రాజెక్ట్లు, నిర్మాణంలో పోలీస్ స్టేషన్లు, పోలీస్ ఆరోగ్య రక్షణలో భాగంగా పోలీస్ హెల్త్ ప్రొఫైల్ తదితర వాటి గురించి డీజీపీకి వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు శ్రీనివాసరావు, మల్లారెడ్డి, రాంచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు రమేశ్, సతీశ్, చంద్రశేఖర్, శ్రీనివాస్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.