పాపన్నపేట,జూలై 6 :ఆషాఢ మాసం రెండో ఆదివారం పురస్కరించుకుని ఏడుపాయల వన దుర్గ భవానీ మాతను ఫలాంబరి రూపంలో రకరకాల ఫలాలతో అలంకరించారు.ఈ సందర్భంగా అమ్మవారు ప్రత్యేక రీతిలో చూపర్లను ఆకర్శించే విధంగా అలంకరించారు.ఆషాఢ మాసం పురస్కరించుకొని ఏడుపాయల వన దుర్గా భవానీ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు.వీరు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు,తలనీలాలు,బోనాలు మొక్కులు చెల్లించుకున్నారు.వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్,సిబ్బంది సూర్య శ్రీనివాస్,ప్రతాప్రెడ్డి,శ్యాం,బ్రహ్మచారి, బత్తిని రాజు, నర్సింహులు,వరుణాచారి, నరేశ్,దీపక్,తదితరులు ఏర్పాట్లు చేశారు. వేదపండితులు శంకరశర్మ,పార్థీవ శర్మ,రాము శర్మ,నాగరాజు శర్మ,తదితరులు పూజలు నిర్వహించారు.ఏడుపాయల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తమ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు.