చేర్యాల, జూలై 16: భక్తుల కొంగుబంగారంగా కొలిచే కోరమీసాల మల్లన్న స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రం ఆదివారం భక్తుల నిండిపోయింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. 10వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో అలూరి బాలాజీశర్మ, చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. రాతిగీరలు వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో మల్లన్న ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్య, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సూపరింటెండెంట్ నీల శేఖర్, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు తదితరులు పాల్గొన్నారు.