స్వామి వారిని దర్శించుకున్న సుమారు 20 వేల మంది భక్తులు
పాపన్నపేట, జూన్12: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సన్నిధి ఆదివారం భక్తులతో కళకళలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పాలక మండలి చైర్మన్ బాలాగౌడ్, ఆలయ ఈవో సార శ్రీనివాస్, సభ్యులు, సిబ్బంది భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. ఏడుపాయల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్ఐ విజయ్కుమార్ బందోబస్తు చేపట్టారు.
చేర్యాల, జూన్ 12: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం భక్తజన సంద్రమైంది. భక్తులు నిండిపోవడంతో సందడి నెలకొన్నది. మల్లన్న స్వామీ మమ్మేలు అంటూ భక్తులు చేసిన నామస్మరణతో శైవక్షేత్రం పులకరించింది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో పలు ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మల్లన్నను సుమారు 20వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేగుచెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టిపాత్రలతో భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు రాతిగీరల వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మల్లన్న ఆలయ ఈవో ఎ.బాలాజీ, ఏఈవో వైరాగ్యంఅంజయ్య, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుడిమల్లికార్జున్, పర్యవేక్షకుడు నీల శేఖర్, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.