న్యాల్కల్, జనవరి 26: సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామరూపిణీ.. శ్లోకాలతో అమ్మవారి సన్నిధి మార్మోగింది. చదువుల తల్లి సరస్వతీ దేవికి అభిషేకాలు, కుంకుమార్చనలు, సరస్వతీ యాగం, హారతి తదితర ప్రత్యేక పూజలు చేశారు. గురువారం వసంత పంచమిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని పంచవటీ సరస్వతీ దేవి క్షేత్రం పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో వైభవంగా పూజలు నిర్వహించారు.
ప్రత్యేక పూజల్లో తరించిన భక్తజనం
సరస్వతీ అమ్మవారి జన్మదినం సందర్భంగా జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గంగామాత, సరస్వతీ దేవితో పాటు సాయిబాబా, దత్తాత్రేయ, శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి, సూర్యభగవాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. క్షేత్రంలో ఏర్పాటు చేసిన పద్మవ్యుహంలో భక్తులు కలియ తిరుగుతూ మధ్యలో ఉన్న దుర్గామాతను దర్శించుకున్నారు. అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా, వేద పండితుల ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు.
బోనాలతో భారీ ఊరేగింపు
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంలో వేలాది మంది భక్తులు మంజీరా నది వరకు పాదయాత్ర చేశారు. అనంతరం గంగమ్మకు పూజ చేసి తెప్ప విడిచారు. ఆయా ప్రాంతాల నుంచి బోనాలతో తరలివచ్చిన మహిళాలు గంగమ్మకు పూజలు చేశారు. గంగమాత ఆలయంలోని అమ్మవారితో పాటు శివ లింగానికి పూజించారు. అక్కడ నుంచి బోనాలతో పంచవటీ క్షేత్రానికి తరలివచ్చారు. అనంతరం ఆలయాల చుట్టూ ప్రదక్షణలు చేసి ధ్వజాస్తంభం వద్ద నైవేద్యాలు, బోనాలు సమర్పించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, భజన భక్త మండలి సభ్యులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. జహీరాబాద్ డీఎస్పీ రఘు ఆధర్యంలో పట్టణ, రూరల్ సీఐలు భూపతి, వెంకటేశ్, హద్నూర్ ఎస్సై వినయ్కుమార్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు డోలారోహణం, స్వామివారి కల్యాణం
వసంత పంచమి వేడుకల్లో భాగంగా శుక్రవారం సరస్వతీ ఆమ్మవారికి డోలారోహణం, శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా తెలిపారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్లు, స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
గరుడగంగ సరస్వతీ ఆలయంలో
మెదక్ రూరల్, జనవరి 26: గరుడగంగ సరస్వతీ ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మెదక్ మండలంలోని పేరూరు గ్రామ శివారు మంజీరా తీరంలో వెలిసిన గరుడగంగ సరస్వతీ మాత 20 వార్షికోత్సవాన్ని, వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మవారికి అభిషేకాలు , మహాబాలాభిషేకం, అలంకారణ, సరస్వతీ యజ్ఞం, పూర్ణాహుతి, ప్రత్యేక పూజలు చేశారు. దోర్బల రాజమాళి శర్మ దేవి చండి ఉపాసకులు, చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. మధ్యాహ్నం అన్నదానం, సాయత్రం ఆలయం చుట్టూ బండ్ల రథం ఊరేగించారు. కార్యక్రమంలో వేద పండితులు గుణశేఖర శర్మ, మహేశ్శర్మ, ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు.
బొరంచమ్మ దేవాలయంలో
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 26: వసంత పంచమిని పురస్కరించుకుని మెదక్లోని బోరంచమ్మ దేవాలయంలోని సరస్వతీ ఆలయంలో గురువారం అర్చకుడు శివరామచార్యులు ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సరస్వతి శిశు మందిర్లో చిన్నారులకు సామూహిక అక్షరభ్యాసం చేయించారు.