న్యాల్కల్, ఏప్రిల్ 27: మంజీరా కుంభ మేళాకు భక్తులు తరలివస్తున్నారు. మండలంలోని రాఘవపూర్-హుమ్నాపూర్ శివారులోని సరస్వతీ పంచవటీ క్షేత్ర పరిధిలోని గరుడ గంగ మంజీరా తీరం ఆధ్యాత్మికతకు కేంద్రంగా మారింది. కుంభమేళాకు భక్తుల సందడి రోజురోజుకు పెరుగుతున్నది. గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం సమీపంలోని గంగామాత ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చాన, అభిషేకం, పార్థీవ లింగార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచవటీ క్షేత్రంలోని సరస్వతీదేవి, సాయిబాబా, వేంకటేశ్వరస్వామి, సూర్యభగవన్ ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. పంచవటీ క్షేత్రంలో వేదపండితులు చండీయాగాన్ని నిర్వహించారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన సాగసాధువులు, దిగంబర సాధువులు, స్వామీజీలు భాజాభజంత్రీల హోరు మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా మంజీరా నదికి తరలివెళ్లి స్నానాలను ఆచరించారు. ధ్వజాస్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మంజీరా నది తీరంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కాశీనాథ్బాబాతో పాటు నాగసాధువులు మహాగంగహారతి ఇచ్చారు. పంచవటీ క్షేత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కాశీనాథ్బాబాతో పాటు శివయోగేశ్వర్ మహాస్వామి తదితరులు భక్తులకు ప్రవచనాలను బోధించారు. పలువురు దాతలు భక్తులకు అన్నదానం చేశారు.
– సంగారెడ్డి జడ్పీ సీఈవో ఎల్లయ్య
సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ ముఖ్య కార్యదర్శి ఎల్లయ్య మంజీరా కుంభమేళాను సందర్శించారు. భక్తుల కోసం మంజీరా తీరంలో ఏర్పాట్లను పరిశీలించారు. నదిలో భక్తులు స్నానాలు చేసే సమయంలో గజ ఈతగాళ్లు, పోలీసులు, వలంటీర్లు సిద్ధంగా ఉండాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జహీరాబాద్, నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎల్పీవో రాఘవరావు, తహసీల్దార్ ఆంటోనీ, మండల అభివృద్ధి అధికారి వెంకట్రెడ్డి, పంచాయతీ అధికారి సురేశ్, ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
గరుడ గంగ పూర్ణ మంజీరా కుంభమేళాకు తెలంగాణ జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం నాయకులు, జంగమ అర్చక పురోహితులు రానున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు విశ్వేశ్వరయ్య, వీరశైవ జంగమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పరమేశ్వరస్వామి, గౌరవాధ్యక్షుడు విశ్వేశ్వరయ్య తదితరులు హాజరుకానున్నారని పంచవటీ క్షేత్ర ప్రధాన పూజరి అయ్యప్పస్వామి తెలిపారు. మంజీరా నది, పంచవటీ క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేయనున్నారన్నారు. అనంతరం పంచవటీ క్షేత్ర ఆవరణలో భక్తుల కోసం తెలంగాణ జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే మజ్జిగ శిబిరాన్ని ప్రారంభించానున్నారన్నారు. కార్యక్రమానికి జంగమ అర్చక పురోహితులు, జంగమ కులస్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.