వర్గల్, ఫిబ్రవరి14: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని విద్యాసరస్వతీ మాత ఆల యం భక్తులతో కిటకిటలాడింది. బుధవారం వసంతపంచమి (శ్రీపంచమి) వేడుకలు ఆధ్యాత్మికశోభ ఉట్టిపడేలా జరిగాయి. సరస్వతీఅమ్మవారి దివ్యసన్నిధానంలో ఉదయం ఆలయ వ్యవస్థాపక, శాశ్వత అధ్యక్ష చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖరశర్మసిద్ధాంతి స్వీయపర్యవేక్షణలో నాలుగు గంటల ప్రాంతంలో అమ్మవారికి వేదమంత్రోచ్ఛారణల మధ్య విశేషపంచామృతాభిషేకాలు జరిపించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని శంభుడిగిరి కొండల చుట్టూ ప్రదక్షిణం చేయించారు. పుస్తకపూజ, చప్పన్భోగ్, కుం కుమార్చన, లక్షపుష్పార్చన, చండీహోమం నిర్వహించారు. పెద్దఎత్తున భక్తుల రాకతో ఆలయ రోడ్లన్నీ రద్దీగా మారాయి. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. మధ్యాహ్నం వరకు ఆరువేలకుపైగా అక్షరాభ్యాసాలు పూర్తయినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మహా అన్నప్రసాదం వద్ద సాయం త్రం వరకు జనసమూహం కనిపించింది. వసంతమహోత్సవాన్ని పురస్కరించుకొని పీఠాధిపతులు విద్యానృసింహభారతి, మాధవానందసరస్వతీస్వామి, మధుసూదనందసరస్వతీస్వామిలతోపాటు సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తదితరులు విద్యాసరస్వతీమాతను దర్శించుకున్నారు.
చిన్నకోడూరు, ఫిబ్రవరి 14: దేశంలోనే మొట్టమొదటి వీణాపాణి మొదటి సరస్వతీక్షేత్రం ప్రకృతి ఒడిలో చదువుల తల్లి విరాజిల్లుతున్నది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో సహజసిద్ధమైన ప్రకృతి సోయగాల నడుమ సరస్వతీ క్షేత్రం వెలిసింది. ఈ క్షేత్రంలో సరస్వతీమాత పుట్టిన రోజును (వసంత పంచమి) పురస్కరించుకొని బుధవారం వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆలయాన్ని సుందరంగా విద్యుత్ కాంతులతో అలంకరించారు. సరస్వతీమాతకు ప్రత్యేక పూజలతోపాటు అక్షర స్వీకారం, కుంకుమార్చనలు, ఒడిబియ్యం, సామూహిక అక్షరాభ్యాసం, వ్రతాలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
న్యాల్కల్, ఫిబ్రవరి 14: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ సిద్ధ సరస్వతీ దేవి పంచవటీ క్షేత్రం భక్త‘జన’ సంద్రమైంది. సరస్వతీ నమస్తుభ్యం..వరదే కామరూపిణీ..శ్లోకాలతో అమ్మవారి ఆలయం మార్మోగింది. బుధవారం వసంత పంచమిని పురస్కరించుకుని క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో వైదేహి అయ్యప్పస్వామి పర్యవేక్షణలో వేదపండితులు అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, సరస్వతీయాగం, హారతి తదితర పూజలు చేశారు. జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పవిత్రమైన మంజీరానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం ప్రత్యేక బారికేడ్ల గుండా వెళ్లి గంగామాత, సరస్వతీ అమ్మవారితో పాటు సాయిబాబా, సూర్యభగవాన్, జ్యోతిర్లింగాలు, శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఆయా ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు తరలివచ్చారు. క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా, వైదపండితులు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంలో కాశీనాథ్బాబా వేలాది మంది భక్తులతో కలిసి మంజీరానది వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం మంజీరానదిలో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి తెప్పను విడిచిపెట్టారు. వివిధ ప్రాంతాల నుంచి బోనాలతో తరలివచ్చిన మహిళలు మంజీరానది వద్ద గంగమ్మకు, గంగామాత ఆలయంలోని అమ్మవారితో పాటు శివలింగానికి భక్తులు పూజలు చేశారు. వేలాది మంది మహిళలు బోనాలు ఎత్తుకొని పంచవటీ క్షేత్రానికి పాదయాత్రగా తరలివచ్చారు. అనంతరం ప్రదక్షిణలు చేసి ధ్వజాస్తంభం వద్ద నైవేద్యాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జహీరాబాద్ రూరల్ సీఐ నోముల వెంకటేశ్ ఆధ్వర్యంలో హద్నూర్ ఎస్సై రామానాయుడు పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర నాయకుడు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం. జైపాల్రెడ్డి రాఘవపూర్లోని సిద్ధ సరస్వతీదేవి పంచవటీ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా క్షేత పీఠాధిపతి కాశీనాథ్బాబాతో కలిసి అక్షరాభ్యాస సామగ్రిని తల్లిదండ్రులకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బుచ్చిరెడ్డి, శివాజీపాటిల్, మోహన్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, ఏక్నాథ్పాటిల్, ఓంకర్యాదవ్, జైపాల్రెడ్డి, జనార్దన్రెడ్డి పాల్గొన్నారు.
మెదక్రూరల్, ఫిబ్రవరి14: మెదక్ జిల్లాలోని గరుడగంగ సరస్వతీ ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం మెదక్ మండల పరిధిలోని పేరూరు గ్రామ శివారులోని మంజీరాతీరంలో వెలిసిన గరుడగంగ సరస్వతీమాత 21వ వార్షికోత్సవం, వసంత పంచమిని పురస్కరించుకుని ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి మహాబాలాభిషేకం, అలంకారం, సరస్వతీయజ్ఞం, పూర్ణాహుతి తదితర పూజలు చేశారు. దోర్బల రాజమాళిశర్మ, మహేశ్శర్మ చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం అమ్మవారికి భక్తులు ఒడిబియ్యం సమర్పించారు. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం ఆలయం చుట్టూ ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించారు. జిల్లాలోని భక్తులే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.