కంది, నవంబర్ 27: సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయని రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం కంది మండలంలోని ఎద్దుమైలారం, ఇంద్రకరణ్, కౌలంపేట, మామిడిపల్లి, తున్కిలతండా, వడ్డెనగూడ తండా, ఎర్ధనూర్, బేగంపేట గ్రామాల్లో చింతా ప్రభాకర్ పర్యటించి సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ప్రతి పంచాయతీకి రూ.20 లక్షల నిధులు కేటాయించారన్నారు.
మారుమూల గ్రామాలు, తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్ది సకల సౌకర్యాలు కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. పట్టణాలకు తీసిపోకుండా పల్లెలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయన్నారు. గ్రామాల్లో నిరంతర ప్రక్రియగా అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉంటాయన్నారు. గ్రామాల పర్యటనలో తన ముందుకొచ్చిన పనులు, సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలవాలన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభానికి వెళ్లిన చింతా ప్రభాకర్కు పార్టీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, ఎంపీపీ సరళా పుల్లారెడ్డి, జడ్పీటీసీ కొండల్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్, టీఆర్ఎస్ కంది మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, నాయకులు రాంరెడ్డి, ఖాజాఖాన్, చిల్వేరి ప్రభాకర్, నందకిశోర్, వేణువర్ధన్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.