సిద్దిపేట, జూన్11: వానకాలం రావడంతో వరద ముంపును కట్టడి చేసేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు ఆదేశాలతో ముందస్తుగా కోమటి చెరువు కట్ట కాలువ చుట్టూ ఉన్న పరీవాహక ప్రాంతంలో పూడికతీత పనులు చేపట్టారు. కోమటి చెరువు కట్టు కాలువ పూడిక తీత పనులు నర్సాపూర్ చెరువు వరకు కొనసాగుతున్నాయి. దీంతో వానకాలంలో భారీ వర్షాలు పడితే ఈ ప్రాంతాలు జలమయం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కాలువలో పెరుకుపోయిన గుర్రపు డెక్కను తొలిగించడంతో వరద సాఫీగా వెళ్లేట్టు చర్యలు చేపట్టారు. దీంతో శ్రీనగర్ కాలనీ, ఎమ్మార్వో ఆఫీస్ ఏరియా, శ్రీనివాస్ నగర్, లోహిత్ సాయి హాస్పిటల్ ఏరియాతో పాటు కాలువ పరీవాహక ప్రాంతం ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
దీనికి తోడు కెనాల్ చెరువు, కెనాల్ సైడ్ వాళ్లు పలుచోట్ల కూలిపోయాయి. అకడ నూతనంగా సైడ్ వాళ్లు నిర్మిస్తున్నారు. గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు చెరువు కాలువ పొంగి పొర్లడంతో పాటు చాలా ఇండ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే హరీశ్రావు ఈ కాలనీలకు మళ్లీ వరద ముంపు రాకుండా ముందస్తుగా కోమటి చెరువు కాలువ పూడిక తీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పనులు జోరుగా సాగుతున్నాయి. నాలా సమస్యలు తలెత్తకుండా, వరద ముంపునకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో ఆ కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే హరీశ్రావుకు ధన్యవాదాలు
కోమటి చెరువు చెరువు కాలువ పూడిక తీస్తుండటం సంతోషకరం. ఎమ్మెల్యే హరీశ్రావు ప్రత్యేక చొరవ తీసుకుని పూడిక తీత పనులు చేయిస్తున్నారు. వర్షాలు రాకముందు పూడిక తీయడంతో వరద ముంపు భయం లేదు. గతేడాది భారీ వర్షాలు కురుసినప్పుడు వరద రావడంతో ఇంట్లో నుంచి బయటకు రావడం ఇబ్బందయ్యింది. ముందస్తుగా పనులు చేయిస్తున్న ందుకు హరీశ్రావుకు కృతజ్ఞతలు.
– అజయ్ కుమార్, శ్రీనగర్ కాలనీ (సిద్దిపేట)