జహీరాబాద్, జూలై 10: దేశ ప్రజలు సీఎం కేసీఆర్ను ప్రధాన మంత్రి చేసేందుకు ఎదురు చూస్తున్నారని, మహారాష్ర్టలో మూడు నెలల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని ఎన్ కన్వెన్షన్లో సామాజిక ఉద్యమకారులు ఢిల్లీ వసంత్కుమార్ బీఆర్ఎస్లో చేరిక కోసం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న మాట్లాడారు. ఢిల్లీ వసంత్ చెరుకు రైతుల సమస్యల పరిష్కారానికి జహీరాబాద్ నుంచి ఢిల్లీ వరకు 2140 కిల్లోమీటర్లు పాదయాత్ర 54 రోజుల పాటు చేయడం గొప్ప విషయమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను చూసి పార్టీలో ఢిల్లీ వసంత్ చేరారన్నారు. బీఆర్ఎస్ దేశానికి అవసరమని రైతులు, ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలు రైతులను మోసం చేశారు తప్ప ఎప్పుడూ సమస్యలు పరిష్కారం చేయలేదన్నారు. దేశంలో కేసీఆర్ గాలి వీస్తున్నదని, మహారాష్ట్ర రైతులు సీఎం కేసీఆర్ను ప్రధానమంత్రి చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జహీరాబాద్లో ఎమ్మెల్యే మాణిక్రావు, ఢిల్లీ వసంత్, నరోత్తం బీఆర్ఎస్లో ఉండడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపు ఖాయమన్నారు. జహీరాబాద్లో కాంగ్రెస్, బీజేపీ అడ్రస్ ఉండదన్నారు. నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
కాళేశ్వరం నీటిని సింగూర్లో నింపి, సింగూర్ నుంచి జహీరాబాద్కు ఎత్తిపోతల ద్వారా సరఫరా చేసి, వ్యవసాయానికి సాగునీరు సరఫరా చేస్తామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు జహీరాబాద్లో ఎకరా భూమి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉండేదని, ఇప్పుడు రాష్ట్రంలో రావడం, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి చూసి భూముల ధర జహీరాబాద్లో ఎకరానికి రూ. 50 లక్షలకు చేరిందన్నారు. ఆంధ్రాలో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాలో ఎకరా భూమి అమ్మి, తెలంగాణలో 10 ఎకరాలు కొనుగోలు చేసే వారని, ఇప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే, ఆంధ్రాలో 50 ఎకరాల భూమి కొనుగోలు చేసే అవకాశం వచ్చింద అన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. గతంలో కరెంట్ కోసం రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని, తెలంగాణలో రైతులకు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు కష్టాలు తప్ప లాభాలు లేవన్నారు. జడ్ పేరుతో జహీరాబాద్ చివరి వరుసలో ఉందని, దానిని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. జహీరాబాద్, కోహీర్లో కొత్తగా దవాఖానలు నిర్మాణం చేసి పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. రాజకీయాల కంటే అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో ఒక శాసనసభ స్థానంలో గెలువలేదని, 10 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి శాసన సభ స్థానంలో ఈసారి బీఆర్ఎస్ గూలాబీ జెండా ఎగురవేస్తుందన్నారు. చింతా ప్రభాకర్, మాణిక్యంలు కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసే పనిలో ఉన్నారన్నారు. సింగూర్ జలాలు మెదక్ జిల్లా రైతులకు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపొందడం ఖాయమైందన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు మాణిక్రావు, క్రాంతికిరణ్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు భూపాల్రెడ్డి, భిక్షపతి, తన్వీర్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్తోపాటు పలువురు ఉన్నారు. ఢిల్లీ వసంత్తోపాటు ఎల్.జనార్దన్, మదవ్రెడ్డి తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
బుర్థిపాడులో ఆటో నగర్కు భూమి పూజ జహీరాబాద్ మండలంలోని బుర్థిపాడు శివారులో ఆటోనగర్ కోసం మంత్రి తన్నీరు హరీశ్రావు భూమి పూజ చేశారు. జహీరాబాద్ పట్టణంలో ఉన్న మెకానిక్లకు షాపుల కోసం స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం భూమి పూజ చేశారు.
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లోకి ఢిల్లీ వసంత్కుమార్
సీఎం కేసీఆర్ చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్లో చేరుతున్నానని సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్కుమార్ తెలిపారు. దేశ ప్రజలు సీఎం కేసీఆర్ చేస్తున్న రైతు సంక్షేమం, ప్రధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.
మహారాష్ర్టలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుంది : శంకరన్న, మాజీ ఎమ్మెల్యే నాందేడ్
సీఎం కేసీఆర్ మహారాష్ర్టలో మూడు నెలలలోనే ప్రభంజనం సృష్టిస్తుందని నాందేడ్ మాజీ ఎమ్మెల్యే శంకరన్న అన్నారు. ఢిల్లీ వసంత్ తనకు మిత్రుడని, ఢిల్లీ వరకు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. దేశం కోసం సీఎం కేసీఆర్ ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ర్టలో బీఆర్ఎస్ గాలి వీస్తున్నదని చెప్పారు. కేసీఆర్ మిషన్ దేశ వ్యాప్తింగా నడిపించేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు.