హుస్నాబాద్, ఏప్రిల్ 28: దేశ సంపద మొత్తాన్ని ఆదానీ, అంబానీలకు దోచిపెట్టి కార్పొరేట్లను పెంచిపోషించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కోహెడలోని వేంకటేశ్వర గార్డెన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు పంచుతారనే బీజేపీ అబద్ధ్దపు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దన్నారు. గడిచిన పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదన్నారు. ఓడిపోతామనే భయంతోనే మంగళ సూత్రాలు గుంజుకుంటారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఐదేండ్లలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ చేసిందేమీ లేదన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని పదేపదే చెప్పడం సరికాదన్నారు. వంద రోజుల్లో దాదాపు అన్ని గ్యారెంటీలను అమలు చేశామని, పార్లమెంటు ఎన్నికల కోడ్ రావడంతో కొన్ని గ్యారెంటీల అమలులో జాప్యం జరిగిందన్నారు. ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, రూ.4వేల పెన్షన్ ఇస్తామని, వానకాలం పంటకు రూ. 500ల బోనస్ ఇస్తామని, రేషన్కార్డులు ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కోహెడ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.