జహీరాబాద్, జూన్ 13: జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ లైన్ ఏర్పాటు చేసేలా కలిసికట్టుగా పోరాటం చేద్దామని అఖిలపక్షం నాయకులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. శనివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఆధ్యక్షతన అఖిలపక్ష నాయకులు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా పలువురు అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. హైదరాబాద్-ముంబయి రూట్లో జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లేలా రైల్వే మంత్రిత్వశాఖ డీఆర్పీ అలైన్మెంట్లో ఖరారు చేసిందన్నారు.
రెండో విడత డీఆర్పీ అలైన్మెంట్లో జహీరాబాద్కు బదులుగా కోకాపేట్, వికారాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లేలా ప్రతిపాదనలు సిద్ధం చేయడం సరికాదన్నారు. ఇప్పుడిప్పుడే జహీరాబాద్ ప్రాంతం నిమ్జ్, స్మార్ట్సిటీ తదితర వాటితో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, బుల్లెట్ ట్రైన్ లైన్ వికారాబాద్ మీదుగా దారి మళ్లించడంతో తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బుల్లెట్ ట్రైన్ జహీరాబాద్ మీదుగా వెళ్లే వరకు పార్టీలకతీతంగా కలిసికట్టుగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.రైల్వే మంత్రులు, సంబంధిత రైల్వే ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అనంతరం అఖిలపక్షం నాయకులు తదితరులు ర్యాలీగా పట్టణంలోని రైల్వేస్టేషన్కు వెళ్లి, రైల్వేస్టేషన్ మాస్టర్ మాధవకృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అఖిల పక్ష ప్రజాప్రతినిధులు శివకుమార్, మహ్మద్ యూనూస్, వివిధ పార్టీల నాయకులు ఉజ్వల్రెడ్డి, తన్వీర్ హైమద్, అల్లాడి నర్సింహులు, జ్యోతి బండారి, విజేందర్రెడ్డి, అత్తర్ హమ్మద్, జి.గుండప్ప, విజయ్కుమార్, తంజీం, తట్టు నారాయణ, శంకర్పాటిల్, మహిపాల్, గొల్లభాస్కర్, నర్సింహులు, జగన్నాథ్, ఖాజమియా, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.