పాపన్నపేట, ఫిబ్రవరి 26 : ఏజాతి మనుగడైనా అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడంపైనే ఆధారపడి ఉంటుందని, మన ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోక పోతే మన అస్తిత్వానికి ముప్పు తప్పదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఆదివారం రాత్రి ‘పరంపర ఫౌండేషన్’ ఆధ్వర్యంలో సాంస్కృతిక నృత్య ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హరీశ్రావు హాజరయ్యారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మహిళా కమిషనర్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, కలెక్టర్ రాజార్షిషా, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి తదితరులు హాజరుకాగా, భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. అధికారులు, నాయకులు ఈ నృత్య ప్రదర్శన తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మనం తెలుగువారమని గర్వంగా, గొప్పగా చెప్పుకోవాలన్నారు.
పరంపర ఫౌండేషన్ గురించి చాలాసార్లు విన్నానని, ఇంత గొప్ప ప్రదర్శన ఏర్పాటు చేస్తారని తాను ఊహించలేకపోయానని అన్నారు. బెంగళూరుకు చెందిన కళాకారుల ప్రదర్శించిన హనుమాన్, దేవతల నృత్య ప్రదర్శనలు బాగున్నాయన్నారు. రామలక్ష్మణ జానకీ అనే నృత్య ప్రదర్శన తనకు బాగా నచ్చిందన్నారు. ఇలాంటి ప్రదర్శనలు ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించాల్సిందిగా మంత్రి పిలుపునిచ్చారు.
దేశ సంస్కృతి సంప్రదాయాలను పునర్నిర్మించే విధంగా పరంపర ఫౌండేషన్ కృషిచేస్తున్నదని అభినందించారు. ఇక్కడి ప్రజలకు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడంపై వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, ఏడుపాయల ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఆలయ ఈవో సార శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల నాయకుడు విష్ణువర్ధన్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.