అందోల్, మే 2: అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నా రు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగం గా సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ స్థాయి సమావేశం శనివారం జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్హాల్లో జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నామన్నారు.
జిల్లా స్థాయిలోనే 90 శాతం వైద్య సేవలు అందించే దిశగా ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సేవలందించేందుకు ట్రామా, ఎమర్జెన్సీ సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా గతంలో పావలావడ్డీ పథకం, అనంతరం వడ్డీ లేని రుణాల పథకాలు అమలు చేసినట్లు గుర్తుచేశారు. ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యతో పాటు పౌష్టికాహారం, మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.
అందోల్ ప్రాంతంలో త్వరలో ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. రూ.200 కోట్లతో సింగూర్ లైన్ పనులు చేపట్టామని, సింగూర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల్లో జిల్లా అభివృద్ధి సాధిస్తున్నదని తెలిపారు. మహిళలు, విద్యార్థులు, అంగన్వాడీ పిల్లలకు ప్రభు త్వం అందిస్తున్న సౌకర్యాలు వివరించారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అడిషనల్ కలెక్టర్ పాండు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, ట్రాన్స్కో ఈఈ శ్రీనివాస్, తహసీల్దార్ సాగర్ మధుకర్ రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వర్ పాల్గొన్నారు.