మెదక్లోని వెస్లీ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి 50వ రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శన గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవగా, జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రయోగాలతో విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరుగుతుందని, సమాజానికి ఉపయోగపడే విధంగా వారిని తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రదర్శనలో వివిధ అంశాలపై విద్యార్థులు తయారుచేసిన ఎగ్జిబిట్లను ఆమె తిలకించారు. మొదటి రోజు జిల్లాలోని 251 స్కూళ్లు 501 ఎగ్జిబిట్లను ప్రదర్శించగా, 1500 మంది చిన్నారులు ఆసక్తిగా చూశారు. కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి.
– మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ రూరల్, నవంబర్ 24
మెదక్ మున్సిపాలిటీ,/మెదక్ రూరల్, నవంబర్ 24 : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో దోహదపడుతాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి 50వ రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనను గురువారం జిల్లా విద్యాధికారి రమేశ్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఉపాధ్యాయ సంఘాల నేతలతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యేకు విద్యార్థులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడారు.
నూతన ప్రయోగాలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని, అందుకనుగుణంగా విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే ప్రయోగాలను ఆవిష్కరించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఘనత ఉపాధ్యాయులదేనని కొనియాడారు. విద్యార్థుల్లోని నైపుణ్యతను గుర్తించి వెలికి తీసే పాత్ర సైతం ఉపాధ్యాయులదేనన్నారు. ప్రయోగాలతో విద్యార్థిని, విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి సీవీ రామన్, అబ్దుల్ కలాం, అమర్థ్యసేన్ లాంటి శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. టెక్నాలజీ పెరిగిందని, అందుకనుగుణంగా ఆవిష్కరణలకు కృషి చేయాలన్నారు.
కరోనా వచ్చినప్పుడు మన శాస్త్రవేత్తలు టీకాను తయారు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేటి ఆధునిక ప్రపంచంలో శాస్త్ర విజ్ఞానమే కీలకమని, సైన్స్ పరంగానే దేశం అభివృద్ధి చెందుతున్నదని చాటి చెప్పిన అబ్దుల్ కలాం స్ఫూర్తితోనే ఈ రోజు సైన్స్ ఫెయిర్ జరుపుకొంటున్నామన్నారు. నేను సైతం సైన్స్ఫెయిర్లో పాల్గొన్నానని అప్పటి రోజులను ఆమె గుర్తుకు చేసుకున్నారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నదని అన్నారు.
251 పాఠశాలలు.. 501 ఎగ్జిబిట్లు
మెదక్ జిల్లాలోని 251 పాఠశాలల నుంచి 501 ఎగ్జిబిట్లు ఈ ప్రదర్శనలో ప్రదర్శిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో విద్యార్థులు 463 ఎగ్జిబిట్లు, ఇన్స్పైర్ ఎగ్జిబిట్లు 36, ఉపాధ్యాయులు 2 ఎగ్జిబిట్లు ప్రదర్శిస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రదర్శనకు 18 కమిటీలు వేశామని, ఇందులో 200 మంది ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. గతంలో జరిగిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నుంచి జాతీయస్థాయి ప్రదర్శనలకు జిల్లాలోని ధనుష్, శిరీషాల ప్రయోగాలు ఎంపికయ్యాయని ఆయన గుర్తు చేశారు. జిల్లాలో పాఠశాలలు వాటి పనితీరుపై ఎగ్జిబిట్లు తదితర అంశాలపై నివేదికను సమావేశంలో తెలిపారు. వైజ్ఞానిక ప్రదర్శనకు తమవంతుగా సహకారం అందిస్తున్న వారికి, తెరవెనుక ఉండి సహకారం అందిస్తున్న వారికి సైతం రాజిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తొలిరోజు సుమారు 1500 మంది విద్యార్థులు ప్రదర్శనలను తిలకించినట్లు ఆయన తెలిపారు.
ఎగ్జిబిట్లను ప్రారంభించి తిలకించిన ఎమెల్యే, డీఈవో, ప్రజాప్రతినిధులు
సభ అనంతరం వెస్లీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్ల ప్రదర్శనను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు. డీఈవో రమేశ్కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఎగ్జిబిట్లను తిలకించారు. విద్యార్థినీ, విద్యార్థ్ధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మండల విద్యాధికారి నీలకం ఠం, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, ప్రణీత్కుమార్, మల్లారెడ్డి, సుంకరి కృష్ణ, రాజగోపాల్గౌడ్, ఆయా కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొన్నారు.
నేటి ప్రపంచంలో శాస్త్రవిజ్ఞానమే కీలకం..
నేటి ప్రపంచంలో శాస్త్రవిజ్ఞానమే కీలకమని, సైన్స్తోనే మానవ జీవితం సుసంపన్నమవుతుందని సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ అన్నా రు. విద్యార్థులు నైపుణ్యంతో కూడిన ప్రయోగాలను రూపొందించాలన్నారు. వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థుల జీవితాల్లో ఎంతో ముఖ్యమైనదన్నారు. శాస్త్రవేత్తలు కనిపెట్టిన వాటినే మనం ఉయోగిస్తున్నామన్నారు. మానవాళి మనుగడకు శాస్త్రవిజ్ఞానం దోహదపడేలా ఉండాలన్నారు. అనేక మంది శాస్త్రవేత్తలు ప్రయోగాల కోసం తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేశారన్నారు. ప్రతిభతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, మేథస్సుతో చేసే ప్రతి పని సైన్స్తో ముడిపడి ఉంటుందన్నారు. విద్యార్థులు నైపుణ్యంతో కూడిన ప్రయోగాలను రూపొందించి సమాజానికి తమవంతు సహకారం అందించాలని సూచించారు.
-జిల్లా విద్యాధికారి రమేశ్ కు మార్, మెదక్
తక్కువ ఖర్చు తో వెంటిలేటర్
ఆవిష్కర్తలు : ప్రవళిక , సాగరిక
గైడ్ టీచర్ : చైతన్య
పాఠశాల పేరు : గీతా పాఠశాల నర్సాపుర్
అంశం : తక్కువ ఖర్చుతో వెంటిలేటర్
వివరణ : వెంటిలేటర్ అతి తక్కువ ఖర్చుతో తయారు చేసి విద్యార్థులు ప్రదర్శించారు. ఈ పరికరం కేవలం దవాఖానలో కాకుండా ఇంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు .
అగ్రిబోట్
ఆవిష్కర్తలు : రాము,రుచిత్
గైడ్ టీచర్ : రత్నకుమారి
పాఠశాల పేరు : గీతా పాఠశాల మంబోజిపల్లి
అంశం : అగ్రిబోట్
వివరణ : ఆధునిక యుగంలో రోబో వ్యవసాయం చేయడంతో కూలీల సమస్యను తగ్గించి, సమయం ఆదా, ఖర్చు తక్కువగా అవుతుంది.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
సభ ప్రారంభానికి ముందు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల బాలికలు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా తెలంగాణ సాంస్కృతిక, సంప్రదాయబద్ధమైన పాటలకు చప్పట్లతో మార్మోగింది. ఈ సమావేశానికి వ్యాఖ్యతగా వైద్య శ్రీనివాస్ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
వైజ్ఞానిక ప్రదర్శనలు గొప్ప వేదికలు
విద్యార్థుల్లో సృజానత్మకత.. ఆలోచనా శక్తి పెంచేందుకు, విజ్ఞానాన్ని సముపార్జించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు గొప్ప వేదికలని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు. విద్యార్థుల మేథస్సు బయటికి తెచ్చేందుకు ఈ ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. విద్యార్థులు తమ ఆలోచనలను భావితరాలకు ఆవిష్కరణ రూపంలో అందజేయాలన్నారు. చిన్నతనం నుంచే శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.
-మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్
మానవ జీవన శైలికి సైన్స్ ఎంతో అవసరం
మానవ జీవన శైలికి సైన్స్ ఎంతో అవసరమని మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ న్నారు. విద్యార్థుల ప్రతిభ తీయడానికి ఇలాంటి వైజ్ఞానికి ప్రదర్శనలు ఎంతో అవసరమన్నారు. మానవ జీవన వికాసమే పలు పరిశోధనలకు మూలమన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో విద్యార్థులు ముందుకెళ్లాలన్నారు.
-మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మెదక్