కొమురవెల్లి, మార్చి 28: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేటలో పదేండ్లలో ఎప్పుడూ లేనివిధంగా నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. పక్కనే కూతవేటు దూరంలో తపాస్పల్లి రిజర్వాయర్ ఉన్నా గురువన్నపేట రైతుల పంటలు మాత్రం ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది.
గ్రామానికి చెందిన రైతు పుట్ట వెంకట్ మూడు ఎకరాల్లో వరి వేయగా నీళ్లు లేకపోవడంతో అందులో సగం ఇప్పటికే ఎండిపోయింది. మిగతా పంటను బతికించుకోవాలని నీళ్ల ట్యాంకర్ను కిరాయికి మాట్లాడుకొని రెండు రోజలకోసారి వరికి నీళ్లు పెడుతున్నాడు. తాను ఐదేండ్ల క్రితం బోరు వేశానని, మూడెకరాలు పారేదని, ఈసారి మాత్రం కండ్ల ఎదుటే పంట ఎండిపోతుంటే చెప్పలేని బాధ కలుగుతుందని వాపోయాడు.