జహీరాబాద్, జూన్29: చెరుకు రైతుకు రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేదు కబురు చెబుతున్నది. మార్కెట్లో ఎరువుల ధరలు భారీగా పెరగడంతో పంట సాగు ఖర్చులు పెరిగిపోయాయి. మరోవైపు కూలీల సమస్య అధికంగా ఉంది. చక్కెరకు మార్కెట్లో మంచి ధర ఉన్నా కేంద్రం మాత్రం మద్దతు ధర పెంచడం లేదు. గత ఏడాది చెరుకు మద్దతు ధర క్వింటాలుకు కేవలం రూ. 10 పెంచింది. గతేడాది క్వింటాలు రూ. 305 ఉండగా, టన్నుకు రూ. 3050 వచ్చింది. మద్దతు ధర సరిపోవడం లేదని రూ. 500కి పెంచాలని రైతులు డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బుధవారం క్వింటాలుకు మద్దతు ధర రూ. 10 పెంచింది. దీంతో క్వింటాలుకు రూ. 315 అయింది. మద్దతు ధర ప్రోత్సాహకరంగా లేకపోవడంతో చెరుకు సాగు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చేదు మద్దతు ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా చెరుకును జహీరాబాద్లో సాగు చేస్తారు. ఒక్కసారి చెరుకు విత్తనం వేస్తే మూడు, నుంచి ఐదు సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. జహీరాబాద్ డివిజన్లోని జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో చెరుకు సాగు అధికంగా చేస్తారు. జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో ఉన్న ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ ఆరు నెలల పాటు చెరుకును క్రషింగ్ చేసేది.
అయితే, కొన్ని సంవత్సరాలుగా ట్రైడెంట్ యాజమాన్యం చెరుకు సరఫరా చేసిన రైతులకు బిల్లులు చెల్లించడపోవడంతో పాటు ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా పరిశ్రమను మూసివేశారు. దీంతో రైతులు తమ పంటను కర్ణాటక, మహారాష్ట్ర, సంగారెడ్డి, కామారెడ్డిలో ఉన్న పరిశ్రమలకు తరలించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డివిజన్లో చెరుకు సాగు తగ్గిపోయింది. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేయడంతో వ్యవసాయ బోరులు, బావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో చాలా మంది చెరుకు సాగును తగ్గించి ఇతర వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది డివిజన్లో 10 వేల ఎకరాల్లో చెరుకు సాగు చేస్తున్నారని అధికారుల అంచనా వేశారు.
మద్దతు ధర కరువు..
గతేడాది ప్రైవేటు పరిశ్రమలు టన్నుకు రూ. 3050 ఇచ్చి పంటను కొనుగోలు చేశాయి. రైతు ఎకరా చెరుకు పంట సాగు చేసేందుకు రూ. 63వేలు ఖర్చు చేస్తాడు. ఎకరాకు చెరుకు దిగుబడి 30 టన్నుల నుంచి 40 టన్నుల వరకు వస్తుంది. ఈ లెక్కన ఎకరాకు రైతుకు రూ. 1.20 లక్షల ఆదాయం వస్తుంది. ఖర్చులన్నీ పోను ఎకరాకు రూ. 54,500 మిగులుతుంది. చెరుకు పంట తీయడంతో పాటు పరిశ్రమకు తరలించే వరకు రైతు ఖర్చు భరించాలి. రవాణా ఖర్చులు భారంగా మారాయి.
తెలంగాణలో టన్ను చెరుకు సాగు చేసేందుకు రూ. 4వేలు ఖర్చవుతుందని చక్కెర శాఖ జాతీయ వ్యవసాయ వ్యయ ధర కమిషన్(పీఏసీసీ)కి నివేదిక సమర్పించింది. రైతుకు పరిశ్రమలు టన్నుకు రూ. 4వేలు చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని తెలిపింది. పీఏసీసీ నివేదికను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా మద్దతు ధర ప్రకటించింది. ఈ ఏడాది 2022-23 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సాహక ధర(ఎఫ్ఆర్పీ)ని క్వింటాలుకు రూ. 10 చొప్పున పెంచి రూ. 315గా నిర్ణయించింది. బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) సమావేశంలో కేంద్రం ఈ ధరను ఖరారు చేసింది. కానీ కనీస ధరను టన్నుకు రూ. 4 వేలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
భారంగా మారిన రవాణా, పంట నరకడం ఖర్చులు
కర్ణాటక, మహారాష్ట్రలో చెరుకు పండించడం, నరకడం వరకే రైతు బాధ్యత ఉంటుంది. పొలం నుంచి పంటను పరిశ్రమకు తీసుకెళ్లడం పూర్తిగా కర్మాగారాలే చూసుకుంటాయని రైతులు తెలుపుతున్నారు. ఈ సదుపాయం తెలంగాణలో లేదు. రైతు ఒక టన్ను చెరుకును నరకడం, పరిశ్రమకు తరలించేందుకు రూ. 1800 వరకు ఖర్చు పెట్టాలి. దీంతో తమకు నష్టం తప్ప లాభం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పరిశ్రమలు రైతులకు ప్రోత్సాహక ధరతో పాటు చెరుకు నరికే ఖర్చులు ఇస్తుంది.
కేంద్రం మద్దతు ధర ఇవ్వాలి
కేంద్ర ప్రభుత్వం చెరుకుకు రూ. 4వేలు మద్దతు ధర ఇ వ్వాలి. ప్రతి ఏడాది మద్దతు ధర నిర్ణయించినా గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. పంట పెట్టుబడి ఖర్చులు పెరిగినప్పటికీ కేంద్రం రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నది. చెరుకు ఫ్యాక్టరీలు మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు ఇతర వాణిజ్య పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం క్విం టాలుకు రూ. 10 పెంచడం మంచి నిర్ణయం కాదు.
– ఉమాకాంత్ పాటిల్, సీడీసీ చైర్మన్ జహీరాబాద్