పాపన్నపేట, ఆగస్టు 20: ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం పెద్దఎత్తున భక్తుల సందడి నెలకొన్నది. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి, దుర్గామాతను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏడుపాయల చైర్మన్ సతెల్లి బాలాగౌడ్, ఆలయ ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, రవివీర్ కుమార్, తోట నరసింహులు, వరుణాచారి, రాజు, శ్రీకాంత్, సంతోష్ తదితరులు ఏర్పాట్లు చేశారు. వేద పండితులు శంకర శర్మ, పార్థివ శర్మ, మురళీధర్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. పాపన్నపేట ఎస్సై మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు.