చేర్యాల, మార్చి 17: భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిల్లుతున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తులతో నిండిపోయింది. బ్రహ్మోత్సవాల 9వ ఆదివారం సందర్భంగా 35వేల మంది కొమురవెల్లికి వచ్చినట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ తెలిపారు. సోమవారం పుణ్యస్నానాల అనంతరం క్యూలో గంటల పాటు వేచి ఉండి స్వామిని భక్తులు దర్శించుకున్నారు.
పూజలు చేసి గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టారు. సంతానం కలగాలని ఒల్లు బండ పూజలు, రాతిగీరల వద్ద మొక్కులు, కోడెను కట్టి స్వామిని వేడుకున్నారు. ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, ఏఈవోలు గంగా శ్రీనివాస్, బుద్ది శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు సేవలు అందించారు. అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామికి హైదరాబాద్లోని బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన భీమబోయిన ఉమరాజ్యాదవ్ 842 గ్రాముల బంగారు రుద్రాక్షమాలను సమర్పించాడు. బంగారు రుద్రాక్షమాలను ఆలయ అర్చకులు స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్లకు అందజేశారు.