మూడు రోజులు కురిసిన అకాల వర్షాలు సంగారెడ్డి, మెదక్ జిల్లాల రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. భారీ వర్షం, ఈదురుగాలులు, వడగండ్ల వానతో పెద్ద ఎత్తున పంట నష్టం జరుగగా, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నష్టం వివరాలను తెలుసుకోవాలని రెండు జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయడంతో వ్యవసాయ, ఉద్యానవన, ట్రాన్స్కో, పంచాయతీరాజ్ శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి నివేదికలు సిద్ధం చేసి అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో 9339.49 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో అధికంగా నష్టం వాటిల్లింది. వరి,జొన్న, మొక్కజొన్న, టమాటా, ఉల్లిగడ్డ పంటలతో పాటు మామిడి, బొప్పాయి, జామ, వాటర్మిలన్ పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. మెదక్ జిల్లావ్యాప్తంగా 290 ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో వైర్లు తెగిపడి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మంగళవారం మునిపల్లి మండలంలో పర్యటించి రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మెదక్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): జిల్లావ్యాప్తంగా ఇటీవల కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ఆరుగాలం కష్టించి రైతులు కాపాడుకుంటున్న పంటలు నీటిపాలయ్యాయి. జిల్లావ్యాప్తంగా. 290 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు అంచనా. ఉన్నతాధికారులకు అందిన లెక్కల ప్రకారం… మెదక్ జిల్లాలో 21 మండలాల్లో 290 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 293 మంది రైతుల పంటలు దెబ్బ తిన్నాయి. ప్రధానంగా 82 ఎకరాల్లో మొక్కజొన్న, 142 ఎకరాల్లో వరి, 42 ఎకరాల్లో జొన్న, 23 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంటలు దెబ్బ తిన్నాయి. రామాయంపేట, నిజాంపేట మండలాల్లో సుమారు 200 ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలాయి. ఉద్యానవన శాఖ పరిధిలో 350 ఎకరాల్లో వివిధ రకాల పంటల నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
వరి పంటకు భారీ నష్టం…
భారీ వర్షంతో జిల్లాలో వరిపంటకు భారీ నష్టం వాటిల్లింది. వరిపైర్లు సుంకు దశలో ఉండటంతో అనేక ప్రాంతాల్లో సుంకురాలిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న కోత దశలో కిందపడిపోవడంతో యం త్రాలతో కోయలేని పరిస్థితి నెలకొంది.
నిలిచిన విద్యుత్ సరఫరా…
ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన అకాల వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా 11 కేవీ స్తంభాలు 41 విరిగిపోయాయి. ఎల్టీ పోల్స్ 80, 11 కేవీ స్తంభాలు 40 విరిగిపోగా, ఎల్టీ పోల్స్ 78 డ్యామేజ్ అయ్యాయి. పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు శ్రమించడంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
సంగారెడ్డి జిల్లాలో 9339 ఎకరాల్లో పంట నష్టం
సంగారెడ్డి, మార్చి 21 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో సంగారెడ్డి జిల్లాలో 9339.49 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు, ఉద్యానవనశాఖ అధికారి సునీత పంటనష్టం వివరాల ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. 5727.3 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న పంటలకు నష్టం వాటిల్లింది. 3606.19 ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, బొప్పాయి, జామ, పుచ్చకాయ, టమాట, ఉల్లిగడ్డ పంటలకు నష్టం జరిగింది. 2867 ఎకరాల్లో జొన్న, 1570 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టంవాటిల్లింది. వర్షాలతో 16 మండలాల్లోని 240 గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వర్షాలతో 2867.2 ఎకరాల్లో జొన్న, 1570 ఎకరాల్లో మొక్కజొన్న, 925 ఎకరాల్లో శనగ, 158 ఎకరాల్లో కుసుమ, 33 ఎకరాల్లో వరి, 174 ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా రాయికోడ్ మండలంలో 1116 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జహీరాబాద్ మండలంలో 436 ఎకరాలు, మొగుడంపల్లి మండలంలో 482, కోహీర్లో 806, ఝరాసంఘంలో 391, న్యాల్కల్లో 217, రాయికోడ్లో 1119, మునిపల్లిలో 336.3, వట్పల్లిలో 127 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. సదాశివపేట మండలంలో 350 ఎకరాలు, కందిలో 22, అందోలులో 20, పటాన్చెరులో 12, కల్హేర్లో 18, కంగ్టిలో 536, మనూరులో 640, నాగల్గిద్దలో 207, సిర్గాపూర్ మండలంలో ఎనిమిది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
3606 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం
వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లాలో 3606 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం జరిగింది. ముఖ్యంగా వడగండ్ల వానతో పండ్ల తోటలు, కూరగాయల పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. 112 గ్రామాల్లో ఉద్యానవన పంటలకు నష్టం జరిగింది. అత్యధికంగా 2484.29 ఎకరాల్లో మామిడి, 685.1 ఎకరాల్లో ఉల్లిగడ్డ, 199.5 ఎకరాల్లో టమాట, రెండు ఎకరాల్లో జామ, 50 ఎకరాల్లో వాటర్మిలన్, 49.1 ఎకరాల్లో బొప్పాయి 136 ఎకరాల్లో ఇతర ఉద్యానవన పంటలకు నష్టం జరిగింది. కోహీర్ మండలంలో అత్యధికంగా 2227.5 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. జహీరాబాద్ మండలంలో 122 ఎకరాలు, మొగుడంపల్లి మండలంలో 63, ఝరాసంఘంలో 141, న్యాల్కల్లో 65, రాయికోడ్లో 28, మునిపల్లిలో 109.69, వట్పల్లిలో నాలుగు ఎకరాల్లో ఉద్యానవన పంటలు, సదాశివపేట మండలంలో 300 ఎకరాలు, కందిలో 9, కొండాపూర్లో 120, పటాన్చెరులో 150, అమీన్పూర్ మండలంలో ఎనిమిది ఎకరాలు, రామచంద్రాపురంలో ఐదు ఎకరాల్లో, కల్హేర్ మండలంలో ఐవు ఎకరాలు, మనూరులో 230, నాగల్గిద్దలో 19 ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బ తిన్నాయి.