మెదక్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో యాసంగి సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. గతేడాదికి భిన్నంగా ఈసారి ముందుగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. వర్షాలు సమృద్ధిగా కురిసి, భూగర్భజలాలు విసృ్తతంగా ఉండడంతో చెరువులు, ఇతర చిన్న నీటి వనరులు, కుంటలు, చెక్ డ్యాంల్లో నీటి వనరులు పెరిగాయి. దీనికి తోడు వరి సాగు చేసేందుకు ఎలాంటి నిబంధనలు పెట్టకపోవడంతో నీటి వనరుల ఆధారంగా రైతాంగం పెద్దఎత్తున వరి పండించేందుకు సమాయత్తమవుతున్నది. రైతులు ఈసారి కూడా వరి పండించడంపైనే దృష్టి పెట్టడంతో మెదక్ జిల్లాలో 2.86 లక్షల ఎకరాల్లో వరి సాగు కానున్నట్టు వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. అధికారులు ఆ వైపు చర్యలు తీసుకునేందుకు నివేదికలు సిద్ధం చేసి అందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను ఆయా మండలాల్లో అందుబాటులో ఉంచనున్నారు. రైతులకు కావాల్సిన విత్తనాలను పీఏసీఎస్లో అందుబాటులో ఉంచనున్నారు.
పంటల సాగు అంచనా..
వరి సాగు చేయనున్నారు. కాగా మరో 20 వేల ఎకరాల్లో పప్పుదినుసులు, ఇతర పంటలు సాగు చేయనున్నారు. జిల్లాలో యాసంగి సీజన్లో వరి 2,86,375 ఎకరాలు, జొన్న 6596 ఎకరాలు, గోధుమలు 38 ఎకరాలు, మొకజొన్న 3704 ఎకరాలు, శనగలు 952 ఎకరాలు, వేరుశనగ 133 ఎకరాలు, పొద్దుతిరుగుడు 388 ఎకరాలు, ఇతర పంటలు 2779 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు.
మెదక్ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు అవసరమున్న ఎరువులను సొసైటీల ద్వారా సరఫరా చేయనున్నారు. మొత్తం 52 వేల 014 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండనున్నాయి. వీటిలో యూరియా 24,012 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3205 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 1070 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 22,191 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 1536 మెట్రిక్ టన్నులు కావాలని ప్రతిపాదనలు పంపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
యాసంగి సాగుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాం. ఈసారి వరి పెద్దఎత్తున సాగవుతుందని అంచనా వేశాం. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశాం. ఏ పంట ఎంత సాగు అవుతుందని అంచనా వేసి అందుకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ రూపొందించాం.