చేర్యాల, జనవరి 25: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా హుండీ ఆదాయం రూ.1,39,77,230 సమకూరింది. ఆలయంలోని 23 హుండీలను మహా మండపంలో ఈవో బాలాజీ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్ పర్యవేక్షణలో దేవాదాయశాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ రంగారావు సమక్షంలో గురువారం లెక్కించారు. అర్చకులు, ఉద్యోగులు, తాత్కాలిక సిబ్బంది, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి సభ్యులు మొత్తం 230 మందితో హుండీలను లెక్కించారు. గతేడాది డిసెంబర్ 12న 62 రోజుల లెక్కింపులో రూ.69,08,932 నగదు, 20 గ్రాముల మిశ్రమ బంగారం, 6,500 గ్రాముల మిశ్రమ వెండి సమకూరింది.
తాజాగా నిర్వహించిన లెక్కింపులో రూ.1,39,77,230 నగదు, 68 గ్రాముల మిశ్రమ బంగారం, 14కిలోల 800 గ్రాముల మిశ్రమ వెండి, 25 క్వింటాళ్ల బియ్యం, 15 విదేశీ కరెన్సీ లభించింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 43 రోజుల్లో భారీ ఆదాయం వచ్చిందన్నారు. ఈ నగదును ఏపీజీవీబీలో జమ చేశామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు లింగంపల్లి శ్రీనివాస్, చీపురు భిక్షపతి, అల్లం శ్రీనివాస్, తాళ్లపల్లి రమేశ్, పయ్యావుల ప్రవీణ్యాదవ్, అంబాల ఉమారాణి శ్రీనివాస్, కాయితా మోహన్రెడ్డి, ఏఈవో గంగా శ్రీనివాస్, పర్యవేక్షకుడు నీల శేఖర్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.