గజ్వేల్, మే 8: తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసి సర్కార్ దవాఖానలను బలోపేతం చేసింది. దీంతో నేడు గ్రామీణ ప్రాంత వాసులకు నాణ్యమైన వైద్యం అందుతున్నది. గత ప్రభుత్వాల హయాంలో సాధారణ వైద్య సేవలకే పరిమితమైన సర్కార్ దవాఖానల్లో ప్రస్తుతం ప్రసవాలు అధికంగా జరుగుతున్నాయి. చికిత్సల కోసం దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అత్యాధునిక హంగులతో నూతన భవన నిర్మాణం చేపట్టడంతో వైద్యులు తమ సేవలను విస్తృతం చేశారు. వైద్యుల సమష్టి కృషితో గజ్వేల్ దవాఖానకు అవార్డుల పంట పండుతున్నది. గజ్వేల్ దవాఖానలో గర్భిణులు, బాలింతలు, సాధారణ రోగులు, క్యాన్సర్, పక్షవాతం, సాధారణ శస్త్ర చికిత్సలు అందుతున్నాయి. రోజు రోజుకూ దవాఖానకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది. అయితే దవాఖానలో వైద్యులు సాధారణ ప్రసవాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
కార్పొరేట్కు దీటుగా వసతులు
సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు గజ్వేల్ జిల్లా దవాఖాన బలోపేతానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో కార్పొరేట్కు దీటుగా వసతులు అందుబాటులోకి వచ్చాయి. ఆధునికి భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సర్కార్ వైద్యం అంటే భయపడిన వారే ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానలకు క్యూ కడుతున్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసి నాణ్యమైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తుండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు పెద్ద ఎత్తున చికిత్సల కోసం ప్రభుత్వ దవాఖానకు వస్తున్నారు. దీంతో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. గజ్వేల్ దవాఖానలో వైద్యులు అందిస్తున్న సేవలను రోగుల బంధువులు అభినందిస్తున్నారు.
సర్కార్ దవాఖాన బలోపేతం
గతంలో మహిళ గర్భందాల్చినప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చే వరకు ప్రైవేట్ దవాఖానల్లో సుమారు రూ.40 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2014లో ముందుగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో సర్కార్ దవాఖానను బలోపేతం చేశారు. మహిళ గర్భం దాల్చినప్పుటి నుంచి దవాఖానలో ప్రసవించిన తర్వాత ఇంటికి చేర్చే వరకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు సమకూర్చింది. దీంతో దవాఖానలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. గజ్వేల్ దవాఖానలో 2022లో 4348 మంది గర్భిణులు పండంటి బిడ్డలకు జన్మనివ్వగా అందులో 2027 మందికి సాధారణ, 2321 మందికి సిజేరియన్ చేశారు. 2023లో జనవరిలో 365 మందిలో 176 సాధారణ 189 సిజేరియన్, ఫిబ్రవరిలో 317 మందిలో 162 సాధారణ 155 సిజేరియన్, మార్చిలో 375 మందిలో 164 సాధారణ 211 సిజేరియన్, ఏప్రిల్లో 373 మందిలో 154 సాధారణ 219 సిజేరియన్ ప్రసవాలు చేశారు.
సౌకర్యాలతో అవార్డుల పంట దవాఖానలో అందించే వైద్య సేవలను వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంతో జాతీయ స్థాయి వైద్య బృందాలు పరిశీలించి పలు విడతలుగా తనిఖీలు చేపట్టారు. దవాఖానలో అందుతున్న నాణ్యత సేవలను పరిశీలించి అవార్డులకు ఎంపిక చేశారు. అందులో గజ్వేల్ దవాఖాన మాతాశిశు దవాఖానకు రెండు సార్లు కాయకల్ప అవార్డు దక్కింది. ఇటీవల తల్లిపాల అమలు అవగాహన
కార్యక్రమాలతో దవాఖానకు ‘బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇన్టియేటివ్'(బీఎఫ్హెచ్ఐ) న్యూఢిల్లీ గ్రేడ్ వన్ గుర్తింపు ఇచ్చింది.
కేసీఆర్ కిట్.. నగదు ప్రోత్సాహకం సర్కార్ దవాఖానలో గర్భిణులకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. మహిళ గర్భిణి అనే విషయం తెలిసినప్పటి నుంచి అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులు పేరు నమోదు చేసుకొని సంబంధిత ఏఎన్ఎంలు వారి వివరాలు ఆన్లైన్లో నమోదు తర్వాత విడతల వారీగా ప్రభుత్వం నగదు అందజేస్తున్నది. సర్కార్ దవాఖానలో ప్రసవించిన తర్వాత 16 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్ అందజేస్తున్నారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లవాడు పుడితే రూ.12వేల ప్రోత్సాహకం అందించడంతో పేద, మధ్య తరగతి వారు కాకుండా ధనవంతులు కూడా సర్కార్ దవాఖానలోనే ప్రసవాలు చేయించుకునేందుకు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.
తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన
బిడ్డ పుట్టగానే తల్లిపాలు పట్టించే విధంగా సర్కార్ దవాఖానలో తల్లులకు అవగాహన కల్పిస్తున్నారు. తల్లిపాలు అమృతమని, బిడ్డకు ముర్రుపాలు పట్టించడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పడితే బిడ్డతో పాటు తల్లీ ఆరోగ్యంగా ఉంటుంది. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల ప్రాముఖ్యతపై వారం రోజులు గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి దవాఖానకు పరీక్షల కోసం వచ్చే గర్భిణులకు కాన్పు అయ్యే వరకు ఆ తర్వాత ముర్రుపాల ప్రాముఖ్యత గురించి వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు అవగాహన కల్పిస్తున్నారు. బిడ్డ పుట్టిన 15 నిమిషాల్లో ముర్రుపాలు తాగించే విధంగా పాలప్రాముఖ్యతను వివరిస్తున్నారు.
సాధారణ ప్రసవాలు చేసేందుకే ప్రాధాన్యం
ప్రతి నెలా సుమారు 350 వరకు ప్రసవాలు చేస్తుండగా అందులో 50శాతం వరకు సాధారణ ప్రసవాలే చేస్తున్నాం. వైద్యుల సమష్టి కృషితో గజ్వేల్ దవాఖానలో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ప్రతి ఒక్కరికీ సర్కార్ వైద్యంపై నమ్మకం కలిగింది. దీంతో ప్రతిరోజూ దవాఖానకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పేద ప్రజలకు సేవలందిస్తున్నాం. – డాక్టర్ సాయికిరణ్, సూపరింటెండెంట్, గజ్వేల్
దవాఖానలో బాగా చూశారు
సర్కార్ దవాఖానలో మంచి వసతులు ఉన్నాయి. డాక్టర్లు బాగా చూ శారు. ముఖ్యమం త్రి కేసీఆర్ సారు దవాఖానలను బలోపేతం చేయడంతో ఎంతో మంది ఇక్కడే కాన్పులకు వస్తున్నారు. ప్రైవేట్లో డబ్బులు కట్టలేని వారంతా గజ్వేల్ దవాఖానలోనే కాన్పులు చేయించుకుంటున్నారు. ప్రతి నెలా చెకప్కు వస్తే ఎంతో మంది గర్భిణులు కనిపిస్తుండే. డాక్టర్లు బాగా చూడడంతో నేను ఆరోగ్యంగా ఉన్నా. పాప పుట్టగానే కేసీఆర్ కిట్టు ఇచ్చారు. అందులో పాపకు అవసరమయ్యే వస్తువులు ఉన్నాయి.
– జి.శ్రీమతి, మాచిన్పల్లి
వైద్యం బాగుంది
సర్కార్ దవాఖానలో వైద్యం చాలా బాగుం ది. నర్సులు ఎప్పుడూ అందుబాటులో ఉండి చూసుకుంటూ మాట్లాడుతారు. డాక్టర్లు వచ్చి అరోగ్యం ఎలా ఉంది అంటూ మాట్లాడి పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. గజ్వేల్ దవాఖానలో వసతులు బాగున్నాయి. కాన్పు కోసం చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. సీఎం కేసీఆర్ ఉచితంగా సర్కార్ దవాఖానల్లో కాన్పులు చేయిస్తూ ఎంతో మందికి ఆసరాగా ఉంటున్నారు. పేదలకు దేవుడు సీఎం కేసీఆర్. పాప పుట్టగానే కేసీఆర్ కిట్టు ఇచ్చారు.
– అనూష, ఐనాపూర్