రాయపోల్, మే 26: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో పలుచోట్ల మూల మలుపులతో రోడ్లపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మండల కేంద్రం రాయపోల్ శివారులో నిత్యం మూల మలుపు వద్ద కనీసం ప్రమాద సూచిక బోర్డులు లేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రోడ్డుపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. అదే రోడ్డుపై మూల మలుపు వద్ద వైన్స్ ఏర్పాటు చేయడడంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిరోజు వైన్స్ ముందు రోడ్డు రద్దీగా ఉంటుండడంతో మూలమలుపు నుంచి వచ్చే వాహనాలతో ఎప్పడూ ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇటీవల రోడ్డు పక్కనే పైపులైన్ల తవ్వకాలు చేపట్టారు. పనులు తొందరగా జరగక పోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయపోల్ సమీపంలోని తిమ్మక్కపల్లి వద్ద సైతం మూల మలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ మూల మలుపు వద్ద వైన్స్ ఉండడంతో అక్కడ నిత్యం జనం రద్దీగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
అధికారులు ఇప్పటికైనా స్పందించి సూచిక బోర్డులతో పాటు స్టాపర్ల్లను ఏర్పాటు చేయించాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.