ఎల్పీజీపై సబ్సిడీని ఎత్తివేసిన కేంద్రం
ఇప్పటికే ఇష్టారాజ్యంగా ధరల పెంపు
పెరిగిన వంటగ్యాస్ ధరలతో ప్రజల ఇక్కట్లు
కేంద్ర ప్రభుత్వంపై వినియోగదారుల ఆగ్రహం
మెదక్ మున్సిపాలిటీ, జూన్5: వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం రాయితీని పూర్తిగా ఎత్తేసింది. కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన సిలిండర్లు తీసుకున్న వినియోగదారులకు మాత్రమే రాయితీ ఇస్తున్నది. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాధారణ గృహ వినియోగదారులకు కేవలం రూ.40 రాయితీ ఇస్తుండగా, ఇకపై అది కూడా లేదు. మార్కెట్ ధర ఎంత ఉంటే అంత చెల్లించాల్సి ఉండడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. కరోనాకు ముందు సిలిండర్ ధర రూ. 612 ఉండగా ప్రస్తుతం వెయ్యి దాటింది. 2020 మార్చిలో సిలిండర్ ధర రూ.880 ఉండగా రాయితీ కింద వినియోగదారుల ఖాతాలో రూ.348.14 జమయ్యేవి. 2021 ఫిబ్రవరి నుంచి ఒక్కో సిలిండర్పై రూ.40 అందజేశారు. అనంతరం వచ్చే రాయితీని మొత్తానికి ఎత్తేసింది కేంద్రం. కేవలం ఉజ్వల పథకం సిలిండర్లకు మాత్రమే రూ.200 రాయితీని ఇస్తున్నది. ఉజ్వల పథకంలో ఏడాదికి 12 సిలిండర్లకు మాత్రమే ఖాతాల్లో ఈ నగదు జమ చేయనున్నారు.
మెదక్ జిల్లాలో 1,98,358 గ్యాస్ కనెక్షన్లు
జిల్లాలో 21 మండలాలు, 4 మున్సిపాలిటీల్లో 2.16 లక్షల కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నాయి. జిల్లాలో 16 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, లక్షా 98 వేల 358 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో సాధారణం 1,27,789, దీపం 13,085, సీఎస్ఆర్ 35,327, ఉజ్వల 22,157 కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం సాధారణ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1,019 ఉంది.
రాయితీని పెంచాలి
ఇప్పటికే భారీగా గ్యాస్ ధరలు పెంచిన కేంద్రం, ఇప్పుడు సబ్సిడీని పూర్తిగా ఎత్తేయడం దారు ణం. బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గ్యాస్ ధరలు 20 సార్లకు పైగా పెంచి సామాన్యుడి నడ్డివిరిచింది. పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలను మోదీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నది. గ్యాస్ రాయితీ పెంచాలి.
– మల్లేశం, కార్మిక సంఘ నాయకుడు, మెదక్
గ్యాస్ భారంగా మారింది
ఇంతకు ముందు గ్యాస్ కొంటే వారంలోగా ఖాతాలో సబ్సిడీ పడేది. ఇప్పుడు సబ్సిడీ ఎత్తేయడంతో గ్యాస్ మరింత భారంగా మారింది. ఇలా ధర పెంచుకుంటూ పోతే గ్యాస్ కొనలేని పరిస్థితి దాపురిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గ్యాస్ ధర తగ్గించి పేద, మధ్య తరగతి ప్రజల భారాన్ని తగ్గించాలి.
– కరుణ, గృహిణి, మెదక్
కేంద్రం పేదల గురించి ఆలోచించాలి
కేంద్ర ప్రభుత్వం పేదల గురించి ఆలోచించాలి. గ్యాస్ ధరలు పెం చుకుంటూ పోతూ, సబ్సిడీ మొత్తానికి ఎత్తేయడం సరికాదు. ఇప్పటికే పప్పులు, నూనెలు, బియ్య, కూరగాయల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం గ్యాస్ ధరలు తగ్గించకుంటే మెడలు వంచుతాం
– నర్సమ్మ, సీఐటీయూ నాయకురాలు