లింగాయత్ల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని, హైదరాబాద్ కోకాపేట్లో వీరశైవ లింగాయత్ ఆత్మగౌరవ భవనం కోసం రూ.30కోట్ల విలువైన ఎకరం స్థలం కేటాయించి రూ.10కోట్లతో భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. శనివారం మంత్రి సంగారెడ్డి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కంది మండలం కాశీపూర్లో వీరశైవ లింగాయత్ భవన నిర్మాణానికి ఎంపీ బీబీ పాటిల్, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్తో కలిసి భూమిపూజ చేశారు. సదాశివపేట మున్సిపల్ పరిధిలోని సిద్దాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు. న్యాల్కల్ మండలంలో జరుగుతున్న గరుడగంగ మంజీరా కుంభమేళాలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కాకిజనవాడలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశారు.
మనూరు మండలం బోరంచ నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారికి ముక్కుపుడక చెల్లించి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ లింగాయత్ల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన మహనీయుడు సీఎం కేసీఆర్ అన్నారు. బసవేశ్వరుడి పేరుపై ఉమ్మడి జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని గుర్తుచేశారు. లింగాయత్ సమాజాన్ని ఓబీసీలో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు పక్కనే ఉన్న కర్ణాటక డబుల్ ఇంజిన్ సర్కారులో ఎందుకు అమలు కావడంలేదని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా సస్యశ్యామలం అవుతుందని అన్నారు.
-జహీరాబాద్/ సంగారెడ్డి కలెక్టరేట్/కంది/ /న్యాల్కల్/మనూరు, ఏప్రిల్ 29
కంది, ఏప్రిల్ 29: బసవేశ్వరుడు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయుడని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కంది మండల పరిధిలోని కాశీపూర్లో శనివారం వీరశైవ లింగాయత్ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా వీరశైవ లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని, పని విలువ నేర్పిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడని కొనియాడారు. కులరహిత సమాజం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామని, కానీ 12వ శతాబ్దంలోనే దీనిపై గొంతెత్తిన మహనీయుడు బసవేశ్వరుడన్నారు. అప్పట్లోనే అంత గొప్ప ఆలోచన ఉందంటే ఆయన దైవస్వరూపుడేనని, అంతటి గొప్ప వ్యక్తిని నాటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
లింగాయత్ల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన మహనీయుడు మన సీఎం కేసీఆర్ అన్నారు. కాశీపూర్లో అత్యంత విలువైన ఒక ఎకరం భూమిని వీరశైవ లింగాయత్ భవనానికి కేటాయించడంతో పాటు నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని, తక్షణ సాయంగా రూ.50లక్షలను మంత్రి ప్రకటించారు. రాబోయే తరాలకు తెలిసేలా బసవేశ్వరుడి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. లింగాయత్ సమాజానికి ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. వీరశైవ లింగాయత్ ఆత్మగౌరవ భవనం కోసం హైదరాబాద్ కోకాపేట్లో రూ.30కోట్ల విలువ గల ఎకరం స్థలం కేటాయించడంతో పాటు రూ. 10కోట్లతో భవన నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని, మీ పిల్లలు చదువుకునేందుకు, ఐక్యత పెంచేందుకు, అన్ని సమాజాలకు ఈ భవనం ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. బసవేశ్వరుడి పేరుపై ఉమ్మడి మెదక్ జిల్లాలో బసవేశ్వర ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించబోతున్నట్లు తెలిపారు.
కులమతాలు ఏవైనా భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న దేశం మన భారతదేశమని, అందరూ కలిసి మెలిసి ఉండాలన్న బసవేశ్వరుడి సూక్తులు ఆచరణలో పాటించాలన్నారు. లింగాయత్ సమాజాన్ని ఓబీసీలో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పట్టించుకోవడం లేదని, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలని కోరుకున్న మహానుభావుడు బసవేశ్వరుడని, బసవ భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషకరమన్నారు. వీరశైవ లింగాయత్ల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, టీఎస్ ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, జిల్లా కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో నగేశ్, కంది తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీపీ సరళా పుల్లారెడ్డి, జడ్పీటీసీ కొండల్రెడ్డి, వీరశైవ లింగాయత్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.