గజ్వేల్, ఫిబ్రవరి 23: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాటినీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో సాగు, తాగునీటిని ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. కేసీఆర్ దూరదృష్టిలో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణంతో తాగు, సాగునీటికి కష్టాలు గట్టెక్కడంతో పాటు ప్రాజెక్టులో వేసిన చేప పిల్లలతో ఉపాధి లభిస్తుంది. నిత్యం క్విం టాళ్ల కొద్ది చేపలు పట్టుకొని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ విక్రయిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన చేప పిల్లలు కొండపోచమ్మ ప్రాజెక్టు నిండాచేపలు కావడంతో మూడు నెలలుగా చేపలు పట్టుకొని వందలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి.
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రం పక్కనే 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును 2021లో గులాబీ అధినేత కేసీఆర్ ప్రారంభించారు. 16 కిలోమీటర్ల పరిధిలో నిర్మించిన ప్రాజెక్టులో మూడు విడతలుగా చేప పిల్లలు వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన చేపపిల్లలు నాలుగు నుంచి ఐదు కిలోల వరకు పెరగడంతో ఈ ఏడాది నుంచే వాటిని పడుతున్నారు.
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో రోజూ 200 మంది చేపలు పడుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత మొదట 16.50 లక్షలు, రెండోసారి 14.75 లక్షలు, మూడోసారి 13.75 లక్షల చేప పిల్లలు, రోయ్యలు వేశారు. అవి ఇప్పుడు ఒక్కొక్కటి నాలుగు నుంచి ఐదు కిలోల వరకు పెరిగాయి. వాటిపై సర్వహక్కులు భూనిర్వాసితులకే ఉంటాయని బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇస్తూ భరోసా కల్పించింది. చేపలు పెద్దవి కావడంతో గతేడాది మత్స్యకారులు చేపలు పట్టుకునేందుకు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవడంతో కొంతమందికి శిక్షణ ఇచ్చిన అనంతరం అధికారులు అనుమతులు ఇచ్చారు. అర్హులైన వారికి మత్స్యశాఖాధికారులు కార్డులు జారీ చేయడంతో నిత్యం చేపలు పట్టుకొని ఉపాధి పొందుతున్నారు.
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును 15టీఎంసీల సామర్థ్యంతో 16కిలోమీటర్ల పరిధిలో నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటిని సరఫరా చేస్తున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ప్రతి యేడు వేసవిలో సాగునీటిని రైతుల అవసరం మేరకు కాల్వల ద్వారా సరఫరా చేస్తున్నారు. కొండపోచమ్మ సాగర్ప్రాజెక్టు ద్వారా కాల్వ గుండా సాగునీటిని సరఫరా చేయడంతో రైతులు అధిక విస్తీర్ణంలో వరి, కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. గత వేసవిలో కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు ద్వారా ఆయా జిల్లాల పరిధిలోని 715చెరువులు నింపారు. భూగర్భజల మట్టం పెరగడంతోపాటు రైతుల బోరుబావుల్లో పుష్కలంగా నీళ్లు వచ్చాయి.
కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులో ఒక్కో చేప గరిష్ఠంగా ఐదుకిలోల వరకు ఉంది. రోజూ పడవల సాయంతో వలలు వేసి నాలుగు నుంచి ఎనిమిది క్వింటాళ్ల చేపలు పడుతున్నారు. ఇక్కడి చేపలను హైదరాబాద్కు తరలించి విక్రయిస్తున్నారు. ప్రాజెక్టులో పెరిగిన చేపలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. నిత్యం మత్స్యకారులు చేపలు పడుతుండడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కొనుగోలు చేసేందుకు అక్కడికి వెళ్తున్నారు.