జహీరాబాద్, జూలై 13: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ప్రభుత్వ నిర్దేశిత వ్యయంతో ఇంటి నిర్మాణం పూర్తికావడం కష్టంగా మారడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం జహీరాబాద్ నియోజకవర్గానికి మొత్తం 3,405 ఇళ్లను మంజూరు చేసింది. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని మోడల్ గ్రామాల్లో అర్హులకు ఇళ్లను కేటాయించింది. మొదటి విడతలో జహీరాబాద్ మండలానికి 583, మున్సిపాలిటీకి 313, న్యాల్కల్కు 688, మొగుడంపల్లికి 508, కోహీర్కు 549, ఝరాసంగంకు 573 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ మండలాల్లో 1,516 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు పునాదులు తవ్వారు. ప్రస్తుతం వీటిలో 324 ఇళ్లు బేస్మెంట్ లెవల్లో, 52 ఇళ్లు లింటెల్ లెవల్లో, 17 ఇళ్లు స్లాబ్ లెవల్లో ఉన్నాయి. ఇప్పటివరకు బేస్మెంట్ స్థాయి పూర్తి చేసుకున్న 200 ఇళ్లకు, రూఫ్ లెవల్లో ఉన్న 25 ఇళ్లకు బిల్లులు చెల్లించినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు 400 నుంచి 600 చదరపు అడుగులలోపు మాత్రమే ఇళ్లను నిర్మించుకోవాలి. దీనికి తోడుగా ఇసుక, సిమెంటు, ఇటుకలు, ఎర్రరాయి ధరలు భారీగా పెరగడంతో, ప్రభుత్వం చెల్లిస్తున్న రూ. 5 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తికావడం కష్టమేనని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇంటి నిర్మాణానికి రెట్టింపు స్థాయిలో ఖర్చు పెట్టాల్సి వస్తుందని వారి ఆవేదన.
మొదటి విడతలో ఇళ్లు మంజూరైన చాలా మంది నిరుపేద లబ్ధిదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా రూ. లక్ష పెట్టుబడి పెట్టి ఇంటి నిర్మాణం చేపట్టే స్థోమత లేక పనులు ప్రారంభించేందుకు ముందుకు రావడం లేదు. మరికొంత మంది లబ్ధిదారులు తక్కువ విస్తీర్ణం నచ్చక ఇళ్లు కట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. పునాదుల దశలో ఇచ్చే రూ. లక్షకు అదనంగా ఖర్చు కావడంతో చాలా మంది లబ్ధిదారులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పెరిగిన ఇసుక, సిమెంట్, ఇటుక, ఎర్రరాయి ధరలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.