హుస్నాబాద్, నవంబర్ 28 : శ్రీరాంసాగర్ రిజర్వాయర్ నుంచి వరద కాలువ ద్వారా హుస్నాబాద్ లాంటి మెట్ట ప్రాంతాలకు గోదావరి నీళ్లందించి కరువును పారదోలవచ్చని ఆరు దశాబ్దాల క్రితం ప్రతిపాదనలు చేసినప్పటికీ పాలకులు తాత్సారం చేశారు. ఒక ప్రభుత్వం వరద కాలువకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం అంచనాలు వేసి కాలువల తవ్వకం ప్రారంభించినప్పటికీ, చిన్నపాటి చెరువులను తలపించే రిజర్వాయర్ల నిర్మాణానికి అనుమతులిచ్చింది. ఇందులో భాగంగానే 2007లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి గౌరవెల్లి రిజర్వాయర్కు 1.24టీఎంసీల సామర్థ్యంతో శంకుస్థాపన చేశారు.
తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉరికించి తెలంగాణ తెచ్చారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణలోని పల్లెలు బాగుపడాలంటే కావాల్సింది మొట్టమొదట నీళ్లు అని గుర్తించారు. సాగునీటి ప్రాజెక్టులపై సాగునీటి ఇంజినీర్లు, మేధావులతో చర్చించి ఉత్తర తెలంగాణలో చేపట్టిన వరద కాలువ భవిష్యత్ తరాలకు ఏమాత్రం ఉపయోగపడదని, దీని అలైన్మెంట్ మార్చాలని నిర్ణయించారు. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లాలోని ఉమ్మడి హుస్నాబాద్ మండలంలోని గౌరవెల్లి రిజర్వాయర్ను ఆగస్టు 8, 2015న స్వయంగా సందర్శించి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8.23టీఎంసీలకు పెంచుతామని ప్రకటించారు. కుర్చేసుకొని కూర్చుండి గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రిజర్వాయర్ను పూర్తి చేసి అందులో గోదావరి నీళ్లను పోయించారు. జూలై 31, 2022న స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ స్విచాన్ చేసి ట్రయల్ రన్ చేయడం ద్వారా భారీ మోటార్ల నుంచి గోదావరి జలాలు రిజర్వాయర్లో ఎగిసిపడ్డాయి. గోదావరి నీళ్లను చూసిన జనం పులకించి పోయారు. ఇదీ సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చిన తీరు…సారు చెప్పింది చేస్తారు… చేసేదే చెప్తారు…చెప్పనివి కూడా చేస్తారనే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు.
గౌరవెల్లి రిజర్వాయర్ను రూ.2,700 కోట్లతో నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించిన టన్నెల్, పంపుహౌస్, మోటార్లు, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు రూ.770కోట్లు కేటాయించగా.. రిజర్వాయర్ కట్ట నిర్మాణానికి రూ.583కోట్లు, మిగతావి భూసేకరణ, నిర్వాసితుల పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నిధులను కేటాయించారు. 4వేల ఎకరాల భూసేకరణ చేశారు. కోహెడ మండలం నారాయణపూర్ గ్రామం నుంచి రేగొండ పంపుహౌస్ వరకు 12 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాన్ని నిర్మించారు. రేగొండ సమీపంలో రెండు సర్జ్జ్ఫూల్ ట్యాంకులు, పంపుహౌస్ నిర్మాణం చేశారు. ఇక్కడ 132విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేసి పంపులను రన్ చేసేందుకు పంపుహౌస్ పక్కనే 50ఎంవీఏ సామర్థ్యం గల 5భారీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. పంపుహౌస్లో 32మెగావాట్ల సామర్థ్యం గల 3భారీ మోటార్లను బిగించారు. ఒక్కో మోటారు సెకనుకు 2వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తాయి. మూడు మోటార్లు కలిపి 6 రోజుల్లో టీఎంసీ నీటిని నిజర్వాయర్లోకి ఎత్తిపోస్తాయి. 126మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేస్తాయి. రిజర్వాయర్ కట్టను 10.56కి.మీ. పొడవు, 17మీట్లర్ల ఎత్తుతో నిర్మించారు. రిజర్వాయర్లో మొత్తం 8.23టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని లక్షా ఆరు వేల ఎకరాలకు గౌరవెల్లి రిజర్వాయర్ ద్వారా సాగునీరందుతుంది. సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లోని 26,710ఎకరాలు, కరీంనగర్ జిల్లా పరిధిలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లోని 20,634ఎకరాలు, హన్మకొండ జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లోని 1,961ఎకరాలకు ఈ రిజర్వాయర్ ద్వారా సాగునీరందుతుంది. పంపుహౌస్లోని మూడు మోటార్ల ద్వారా ఇప్పటికే రిజర్వాయర్లో అర టీఎంసీకి పైగా నీటిని నింపారు. ప్రతిపక్ష పార్టీల కుట్రల వల్ల ఎన్జీటీ కేసుతో నీటి పంపింగ్కు ఆటంకం కలిగింది. లేకుంటే ఇప్పటికే రిజర్వాయర్ నిండుకుండలా మారేది. సాగు, తాగునీటికేడ్చిన ఇక్కడి ప్రజలకు ఎటు చూసినా నీళ్లే కనిపిస్తాయి. ఏడు మండలాల్లోని వేలాది ఎకరాల సారవంతమైన భూములు గోదారమ్మ నీటితో తడిసి పులకించి పుట్లకొద్దీ పంటలు పండే రోజులు ఎంతో దూరంలో లేదు.
అరవై ఏండ్లుగా గోదావరి నీళ్లకోసం పరితపించిన హుస్నాబాద్ మెట్ట ప్రాంత ప్రజల కల నెరవేరింది. సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలతో ఎట్టకేలకు గౌరవెల్లి రిజర్వాయర్లో గోదారమ్మ జలతాండవం చేసింది. మెట్ట ప్రజల కండ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక వానలు కురవాలని కప్పతల్లి ఆటలు ఆడాల్సిన అవసరం లేదు.వనదేవతలకు పూజలు చేసి వరదపాశం పోయాల్సిన పనిలేదు.వానదేవుడా అంటూ ఆకాశం వైపు చూడాల్సిన అవకాశమే లేదు.యజ్ఞ యాగాదులు, మేఘమథనాలు అక్కరే లేదు.ఒక్కసారి గౌరవెల్లి రిజర్వాయర్ నిండిందంటే మూడేండ్ల పాటు నీటికష్టం లేకుండా పుష్కలంగా పంటలు పండించుకునే అవకాశం హుస్నాబాద్ ప్రజలకు దక్కింది. అపర భగీరథుడు సీఎం కేసీఆర్ విజన్తో మెట్ట ప్రాంతం మొత్తం సస్యశ్యామలం కానున్నది. కరువు, కల్లోల ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారనున్నది. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ రూపురేఖలు మార్చిన సీఎం కేసీఆర్కు, ఇందుకు కృషి చేసిన మంత్రి తన్నీరు హరీశ్రావుకు, స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్కు ఈ ప్రాంత ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారు.
‘తలాపునా పారుతుంది గోదారి… నీ చేను నీ చెలక ఎడారి…’ అంటూ ఓ కవి మెట్ట ప్రాంతాల్లో ఉన్న దుస్థితిని వర్ణిస్తూ రాసి పాడిన పాట ఇది. ఈ పాట అప్పట్లో మెట్ట ప్రాంతాల పరిస్థితులకు అద్ధ్దం పట్టినట్లుగా ఉండటంతో బాగా పాపులర్ అయ్యింది. గోదావరి నది పక్కనుంచే వెళుతున్నప్పటికీ కనీసం గుక్కెడు నీటి కోసం తండ్లాడే జనం…గుంట భూమిని తడుపుకునే దిక్కులేని రైతన్నలు…కరువు కాటకాలతో అల్లాడుతూ ఏండ్లపాటు జీవనం సాగించారు. చివరకు పశువుల గడ్డి కోసం ఉద్యమాలు చేసి కొట్లాడి గడ్డిని తెచ్చుకొని జీవాలను బతికించుకున్న రోజులవి. తాగు, సాగునీరు లేక, తినడానికి తిండి లేక అల్లాడుతూ కుటుంబ పోషణ కోసం దేశ విదేశాలకు వలస పోయి బతుకులు వెల్లదీసిన రోజులవి…నీళ్లుంటే బంగారు పంటలు పండే భూములు ఉన్నప్పటికీ వరుణుడు కరుణించక, సాగునీటి ప్రాజెక్టులు లేక భూములను బీళ్లుగా ఉంచి పట్టణాలకు వెళ్లి కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగించిన గడ్డు రోజులవి…మాకు వేరే ఏమీ వద్దు గోదావరి నీళ్లిస్తే పంటలు పండించుకొని బతుకుతామని పాలకులకు ఎన్ని సారు మొరపెట్టుకున్నా పట్టించుకునే వారు కరువయ్యారు ఆ రోజుల్లో…