CM KCR | మెదక్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నీటి వృథాకు చెక్ పెట్టేందుకు వాగులు, వంకలపై చెక్డ్యామ్లు నిర్మించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సత్ఫలితా లనిస్తున్నది. సాగునీటి సంకల్పం సిద్ధించింది. వాగుల పరీవాహక గ్రామాల రైతుల కల నెరవేరింది. దీంతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో జలసిరులు సంతరించుకున్నాయి. ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టేందుకు జిల్లాల్లో దాదాపు 26 చెక్డ్యామ్లను నిర్మించారు. అవి ఇప్పుడు జలసవ్వడితో మత్తళ్లు దుంకుతున్నాయి. అతి తకువ ఖర్చుతో నిర్మించిన చెక్డ్యామ్లతో రెండు పంటలకూ నీరందుతున్నది. భూగర్భ జలాలు పెరిగాయి. మంజీరా నదిపై నిర్మించిన చెక్డ్యామ్లు సైతం జలకళను సంతరించుకున్నాయి. దీంతో రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వాగులు, వంకలపై చెక్డ్యాంలు నిర్మించాలని తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తున్నది. తకువ ఖర్చుతో నిర్మించిన చెక్డ్యాంల వల్ల ఏకంగా 27వేల ఎకరాలకు రెండు పంటలకు నీరందుతున్నది. చెక్డ్యామ్ల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో మత్తడి దూకుతూ నీరు ప్రవహిస్తోంది. వృథాగాపోతున్న వర్షపునీటికి అడ్డుకట్ట వేస్తూ చెక్ డ్యామ్లు నిర్మించాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో వాగులు, కాలువల ద్వారా నీరు వృథాగా పోకుండా సరారు చర్యలు చేపట్టింది. చెక్ డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
మెదక్ జిల్లావ్యాప్తంగా 15 చెక్డ్యాంల నిర్మాణం
వాగుల్లోంచి వృథాగా వెళ్లే నీటికి అడ్డుకట్ట వేయడానికి నిర్మించిన చెక్ డ్యామ్లు ఫలితాలిస్తున్నాయి. జిల్లాలో ఇటీవల రూ.119 కోట్ల వ్యయంతో 15 చెక్ డ్యామ్లను వివిధ ప్రాంతాల్లో నిర్మించారు. ఇందులో 11 చెక్డ్యాంల నిర్మాణపనులు పూర్తి కాగా, నాలుగు చెక్డ్యాంల నిర్మాణపనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత సీజన్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు వరదనీటితో పొంగిపొర్లుతున్నాయి. వాగుల మధ్యలో చెక్డ్యామ్లు నిర్మించడం వల్ల నీరు వృథాగా వెళ్లకుండా అడ్డుకట్ట పడుతున్నది. దీంతో వాగుల్లో వరదనీరు నిల్వ ఉంటున్నది. వాగుల్లో నిర్మించిన చెక్డ్యామ్ల వల్ల జిల్లాలో సుమారు 27వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందుతున్నది.
మంజీరా, హల్దీవాగులపై చెక్డ్యాంల నిర్మాణాలు
మెదక్ జిల్లాలోని మంజీరా, హల్దీవాగులపై 15 చెక్డ్యాంలను నిర్మించారు. ఇందుకుగానూ రూ.119.11 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మెదక్ నియోజకవర్గంలోని మెదక్ మండలం ర్యాలమడుగు హల్దీవాగుపై రూ.20.98 కోట్లతో చెక్డ్యాం నిర్మించారు. మంజీరా వాగుపై హవేళీఘనపూర్ మండలం కుచన్పల్లిలో రూ.15.51 కోట్లతో చెక్డ్యాం నిర్మించారు. హవేళీఘనపూర్ మండలం సర్ధన గ్రామంలో రూ.12.15 కోట్ల వ్యయంతో చెక్డ్యాం నిర్మించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మంజీరానదిపై చిలిపిచేడ్ మండలం చిట్కుట్ వద్ద రూ.7.64 కోట్లతో నిర్మించగా, చిలిపిచేడ్ మండలం ఫైజాబాద్లో 4.75 కోట్లతో చెక్డ్యాం నిర్మించారు. హల్దీవాగుపై వెల్దుర్తిలో 3.22 కోట్లతో, ఉప్పులింగాపూర్ వద్ద రూ.2.82 కోట్లతో, దామరంచ వద్ద రూ.3.22 కోట్లతో నిర్మించారు. మంజీరానదిపై చిలిపిచేడ్ మండలం అజ్జమర్రి వద్ద రూ.8.68 కోట్లతో, చిలిపిచేడ్ మండలం చండూర్ వద్ద రూ.8.16 కోట్లతో నిర్మించారు. కొల్చారం మండలం ఎనగండ్ల వద్ద రూ.9.58 కోట్లతో, కోనాపూర్ వద్ద రూ.9.60 కోట్లతో, కొల్చారం మండలం పైతర రూ.9.77 కోట్లతో నిర్మించారు. గజ్వేల్ నియోజకవర్గంలో హల్దీవాగుపై తూప్రాన్ మండలం నాగులపల్లి వద్ద రూ.1.50 కోట్లతో, తూప్రాన్ మండలం యావాపూర్ వద్ద రూ.1.50 కోట్లతో నిర్మించారు. మొత్తం15 చెక్డ్యాంలకు రూ.119. 11కోట్లు కేటాయించారు.
చెక్డ్యాంలలో ఎక్కువగా నీటి నిల్వలు
జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగుల్లో పారే నీటికి అడ్డుకట్ట వేయడానికి నిర్మించిన చెక్ డ్యామ్ల వల్ల నీటి నిల్వలు పెరిగాయి. దీంతో వాగులకు ఇరువైపులా భూగర్భ జలాలు సైతం పెరిగాయి. సంవత్సరమంతా వాగుల్లో నిల్వ ఉండే నీటిని రైతులు మోటర్లతో పంటలకు మళ్లించుకునే అవకాశాలున్నాయి. వాగు కట్టలకు ఇరువైపులా గ్రావిటి కాలువలను తవ్వి పంటలకు సాగునీరు అందించే అవకాశముంది. వాగుల్లో చెక్ డ్యామ్లు కట్టడం వల్ల నీటి నిల్వలుండడంతోపాటు వరద ముంపు సైతం తగ్గుతుంది. అదేవిధంగా పరీవాహక ప్రాం తాల్లో రెండు పంటలకు నీళ్లు అందించడంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు రీచార్జయ్యే అవకాశం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో మ త్స్య సంపద కూడా పెరిగే అవకాశం ఉంది.
జలకళను సంతరించుకుంటున్న చెక్డ్యామ్లు
సంగారెడ్డి జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సింగూరు, నల్లవాగు, నారింజ ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని చెరువులు, వాగులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. మంజీరా నదిపై నిర్మించిన చెక్డ్యామ్లూ జలకళను సంతరించుకున్నాయి. వాగుల నుంచి వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టేందుకు సీఎం కేసీఆర్ చెక్డ్యామ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ విజన్ మంచి ఫలితాన్ని ఇస్తున్నది. చెక్డ్యామ్లు నిండడంతో రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతుంది.
నిండుగా మంజీరా నదిపై చెక్డ్యామ్లు
సంగారెడ్డి జిల్లాలో సింగూరు, నల్లవాగు ప్రాజెక్టులు ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టు ద్వారా 40 వేల ఎకరాలు, సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు ద్వారా 6030 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. జిల్లాలోని 3140 చెరువులు, కుంటలతో 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతున్నది. మంజీరాకు వరద వచ్చినప్పుడు నీరు వృథాగా పోతున్నది. దీంతో వరదతోపాటు వర్షం నీటిని ఒడిసిపట్టేందుకు వీలుగా మంజీరాపై చెక్డ్యామ్ల నిర్మిస్తున్నారు. మంజీరా నదిపై సంగారెడ్డి మండలం ఫసల్వాదిలో, హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ వద్ద, పన్యాల గ్రామ శివారులో, హత్నూర మండలం లింగాపూర్ వద్ద నిర్మించిన చెక్డ్యామ్లు పొంగి పొర్లుతున్నాయి. మునిపల్లి మండలం బోడపల్లి గ్రామం వద్ద సింగూర్ బ్యాక్ వాటర్పై నిర్మించిన చెక్డ్యామ్ నిండింది. తాటిపల్లి వద్ద వాగుపై నిర్మించిన చెక్డ్యామ్ ప్రవహిస్తుంది. మంజీరా నదిపై చౌటకూరు మండలం వెండికోల్, హత్నూర మండలం నవాబ్పేటలో చెక్డ్యామ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నల్లవాగు ప్రాజెక్టుపైనా రెండు చెక్డ్యామ్లు నిర్మించనున్నారు.
రెండు పంటలు పండుతున్నయ్..
కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి ర్యాలమడుగు చెక్డ్యాం నింపుతున్నారు. దీంతో వర్షాలతో సంబంధం లేకుండా రెండు పంటలు పండుతున్నాయి. మండుటెండల్లో సైతం చెక్ డ్యాం మత్తడి దుంకుతుండడంతో మా ఆనందానికి ఆవధుల్లేవు. మాప్రాంత రైతాంగానికి శాశ్వతంగా సాగునీటి సమస్యను తీర్చిన సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
– శ్రీహరి, రైతు, మాగ్దుమ్పూర్
ఎక్కడి గోదావరి..ఎక్కడి ర్యాలమడుగు
మండుటెండల్లో చెక్ డ్యాం నిండి మత్తడి దుంకుతుంది. ఎక్కడి గోదావరి..ఎక్కడి ర్యాలమడుగు రైతుల పంటలు ఎండిపోకుండా ఉండాలనే గంగమ్మతల్లిని ఇక్కడికి తెచ్చిన సీఎం సార్ మాకు దేవుడు. పుట్టి ఇన్ని ఏండ్లయింది. వానకాలంలో చెక్ డ్యాం నిండి మత్తడి దుంకతున్నాయి. మా రైతులకు వర్షంతో పనిలేకుండా పంటలు పండుతున్నాయి. రైతుల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– రజినీకాంత్, రైతు, మాగ్దుమ్పూర్, మెదక్
పెరిగిన భూగర్భ జలాలు
హల్దీవాగుపై చెక్డ్యాంల నిర్మాణాలతో భారీగా భూగర్భ జలాలు పెరిగాయి. గతంలో వానకాలంలో భారీగా వర్షాలు కురిసి వాగులో నీళ్లు ప్రవహించి చెక్డ్యాంలు పొంగిపొర్లేవి. కానీ మూడేండ్ల నుం చి వస్తున్న కాళేశ్వరం నీళ్లతో ఎండాకాలంలో సైతం చెక్డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. వానలు పడితేనే వానకాలంలో వరి పంట వేసేవాళ్లం. యాసంగి బోరు బావుల వద్ద కొంత మేర పంటలను వేసేవాళ్లం. కానీ ఇప్పు డు కాళేశ్వరం నీళ్లతో యాసంగిలో కూడా భారీగా పంటలు పండిస్తున్నాం.
– మహేందర్రెడ్డి, రైతు, అరెగూడెం
పూర్తిస్థాయిలో సాగు
హల్దీవాగు వెంబడి మాకు వ్యవసాయ భూమి ఉంది. ఇంతకుముందు వానకాలంలో వానలు పడినప్పుడు వాగులో నీళ్లు పారేవి. అప్పుడు మోటర్లు పెట్టి నీళ్లు పారబెట్టేవాళ్లం. వాగులో నీళ్లు తగ్గిన తర్వాత రింగుబావుల ద్వారా నీళ్లను పొలాలకు పారించేది. కానీ ఇప్పుడు చెక్డ్యాంలు నిర్మించిన తర్వాత వాగులో నీళ్లు పెరగడంతోపాటు చుట్టపక్కల బోర్లల్లో సైతం నీళ్లు పెరిగాయి. దీంతో రింగుబావులు లేకుండానే నేరుగా వాగులో చిన్నచిన్న ఫిల్టర్ బోర్లు వేసి నీళ్లు పారబెడుతున్నాం. వానకాలంలో మాత్రమే ఎక్కువ ఎకరాల్లో పంటలు పండేవి. కానీ నేడు వానకాలం, యాసంగి రెండు సీజన్లలో వరి పంటను పూర్తిస్థాయిలో సాగు చేస్తున్నం.
– శివశంకర్, రైతు, వెల్దుర్తి