నర్సాపూర్, మే 19: కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 25 రోజులు గడుస్తున్నా నేటికి కాంటాపెట్టి తరలించడం లేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆమె బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించి ధాన్యం వెంటనే కాంటా పెట్టి ట్రక్షిట్ ఇవ్వాలని అధికారులను ఫోన్లో ఆదేశించారు.
అనంతరం ఆమె మా ట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వా సం పూర్తిగా కోల్పోయిందన్నారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్ నాయకులు చిన్న టెక్నికల్ ప్రాబ్లం అని అంటున్నారు, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాని టెక్నికల్ ప్రాబ్లం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే మంత్రులు ఎందుకు స్పందించడంలేదని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టుకొని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల కన్నీరు చూస్తున్నదని ఆరోపించారు . కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు చంద్రశేఖర్, రామాగౌడ్, షేక్ హుస్సేన్, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.