రామాయంపేట, మే 1: కాంగ్రెస్ సర్కారు ఏర్పడి మూడేండ్ల్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏఒక్క పని పూర్తి కాలేదు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో రూ.25 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. పట్టణంలోని మల్లె చెరువు, కేసీఆర్ కాలనీ, కోమటిపల్లి గిరిజన తండా, పట్టణంలోని ప్రధాన రోడ్ల అభివృద్ధి కోసం నిధులు మంజూరైనా పనులు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు ఆగమేఘాల మీద శిలాఫలకాలను ఎక్కడపడితే అక్కడ ఆవిష్కరించి రెండేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏరోడ్డు కూడా పూర్తికాకపోవడం విడ్డూరంగా ఉంది.
ఏడాది పూర్తయినా నత్తనడకన పనులు కొనసాగుతుండటంపై పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల పనులు చేపట్టి సగంలోనే వదిలేశారు. దీంతో పట్టణంలోని ప్రజలు ఆరోడ్లపై నడవాలంటే కంకరకారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. పనులు చేపట్టని కాంగ్రెస్ నాయకులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామాయంపేట పట్టణానికి సుదూరంలో ఉన్న కేసీఆర్ కాలనీలో రోడ్ల పనులు చేపట్టినా ఇప్పటి వరకు పూర్తికాలేదు. కాలనీవాసులు పట్టణానికి రావాలంటేనే రోడ్డు సరిగ్గా లేక జంకుతున్నారు. రాత్రిపూట అయితే వీధి దీపాలు లేవు, రోడ్డంతా గుంతలమయంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్ల పనులు పూర్తి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.