గజ్వేల్ అర్బన్, ఫిబ్రవరి 1: కేసీఆర్తోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని, ఐదేండ్లపాటు సర్పంచులు ప్రజలకు సేవలందించారని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్ పట్టణంలోని గడా సమావేశ మందిరంలో ఎంపీపీ అమరావతి ఆధ్వర్యంలో సర్పంచులు, ఉపసర్పంచులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జడ్పీ చైర్పర్సన్, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ హాజరై మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆయా గ్రామాల్లో నూతన గ్రామపంచాయతీలు, మహిళా సంఘాలు, కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్ హాళ్లతో పాటు వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, రైతు వేదికలు నిర్మించామన్నారు.
గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్పంచులు ఎంతో శ్రమించారన్నారు. ప్రతి గ్రామానికి రహదారులు నిర్మించి ప్రజలకు చక్కని పాలనను అందించారని, సర్పంచుల సేవలు మరువలేనివని కొనియాడారు. పెండింగ్లో ఉన్న బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించి వారికి న్యాయం చేయాలని కోరారు. కేవలం అబద్ధాలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పటివరకు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కృష్ణగౌడ్, తహసీల్దార్ బాలరాజు, ఎంపీడీవో మశ్ఛేందర్, సూపరింటెండెంట్ జైపాల్రెడ్డి, ఎంపీవో, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు.