సంగారెడ్డి, మే 8 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళా ఆరోగ్య కేంద్రాల ఉద్దేశం నేరవర్చేందుకు వైద్యులు అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ శరత్ కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆరోగ్య మహిళా కేంద్రాల వైద్య సిబ్బంది, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ప్రభుత్వ జనరల్ దవాఖాన అధికారులతో ఆరోగ్య మహిళా పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆరోగ్యం కోసం చేపట్టిన ఆరోగ్య మహిళా కార్యక్రమం లక్ష్యం నేరవేరేలా సంబంధిత వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. జిల్లాలో ప్రతి మంగళవారం బిలాల్పూర్, ఝరాసంగం, జిన్నారం, ఆర్సీపూర్లో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కేంద్రాల్లో ఓపీ మరింత పెరగాలన్నారు.
డయాగ్నస్టిక్ వంతశాతం జరగాలని, ఆరోగ్య మహిళా కేంద్రానికి వచ్చిన ప్రతి మహిళకు నిర్దేశించిన ఆయా పారామీటర్స్లో పరీక్షలు చేయాలని సూచించారు. ప్రతిపాదిత కేసుల్లో శ్రద్ధ్ద తీసుకొని పర్యవేక్షించాలని ఆయా వైద్యాధికారులకు సూచించారు. ప్రతివారం ఆరోగ్య మహిళా కేంద్రాలను సందర్శించాలని డీఆర్డీవో, జడ్పీ సీఈఓలను ఆదేశించారు. ఆరోగ్య మహిళా కేంద్రాలకు వచ్చిన మహిళలకు పకడ్బందీ పరీక్షలు నిర్వహిస్తే ఫలితం ఉంటుందన్నారు. ఆయా వ్యాధుల లక్షణాలపై ముందుగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు, ఫిర్యాదులపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి కలెక్టర్, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల విజ్ఞప్తులను స్వీకరించారు.
హత్ను రా మండలం సాదుల్నగర్ గ్రామానికి పోచయ్య ఇల్లు కాలిపోవడంతో సహాయం కోసం కలెక్టర్కు రావడంతో 25 కిలోల బియ్యం అందజేసి ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తిరస్కరించిన ఫిర్యాదులకు సవివరమైన వివరణ ఇవ్వాలని, జాప్యానికి తావివ్వవద్దని చెప్పారు. ప్రజావాణిలో ఐసీడీఎస్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ అభివృద్ధి శాఖ, పంచాయతీ, హౌసింగ్, రెవెన్యూ, పశు సంవర్ధక, జిల్లా గ్రామీణ అభివృద్ధి, వైద్యారోగ్య తదితర శాఖలకు సంబంధించిన 48 దరఖాస్తుల వచ్చాయి. అందులో 13 దరఖాస్తులు రెవెన్యూశాఖకు సంబంధించినవి ఉన్నాయి. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారులు పాల్గొన్నారు.
మహిళా కేంద్రాల్లో వ్యాధుల లక్షణాలు ప్రదర్శించాలి
వ్యాధులపై సంబంధిత ఆరోగ్య మహిళా కేంద్రాల్లో ప్రదర్శించాలని సంబంధిత వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. లక్షణాలు వచ్చిన వారిని ఆయా లక్షణాల గురించి అడిగి తెలుసుకొని, ప్రతివారం గుర్తించిన డయాగ్నస్టిక్స్ యూటీఐ మెమోగ్రసీ వివరాల నివేదిక ఇవ్వాలన్నారు. ఆరోగ్యం మహిళలో వచ్చిన పేషెంట్లకు సంబంధించిన ఏఏ పరీక్షలు చేశారన్నది రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితులలో పరీక్షలు చేయాలని నిర్లక్ష్య ధోరణి సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా జనరల్ దవాఖానలో ఆరోగ్య మహిళాకు సంబంధించిన ఆయా సిస్టం ఏర్పాటు చేయాలని, వచ్చిన ప్రాతిపాదిత కేసులన్నింటికీ మెమోగ్రసీ చేయాలని, దవాఖాన సూపరింటెండెంట్ అనిల్ కుమార్ సూచించారు. శాంపిల్స్ సేకరణకు సంబంధించి టీ హబ్ వాహ న షెడ్యూల్ను రీ- షెడ్యూల్ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ గాయత్రిదేవి, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమా ర్, డాక్టర్ నాగలక్ష్మి, డీఆర్డీవో శ్రీనివాస్రావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, మెప్మా పీడీ గీత, బిలాల్పూర్, ఝరాసంగం, జిన్నారం, ఆర్సీ పురం పీహెచ్సీల వైద్యాధికారులు పాల్గొన్నారు.
రేపటిలోగా విధుల్లో చేరాలి..
సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఈ నెల 9తేదీ లోగా తమ విధుల్లో చేరాలని, లేదంటే ఉద్యోగాలు తొలగిస్తామని కలెక్టర్ శరత్కుమార్ హెచ్చరించారు. సోమవారం ప్రభుత్వ రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా స్పష్టంచేస్తూ నోటీసులు జారీ చేశారు. నేడు (09-05-2023)సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని ఆదేశాలే జారీ చేశామన్నారు. ఒకవేల విధుల్లో చెరకపోతే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని నోటీసులో స్పష్టం చేశారు.