దుబ్బాక, మే 2: గ్యాస్ ధర భగ్గుమన్నది. కార్మిక దినోత్సవం రోజు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంచి మోదీ సర్కారు దేశ ప్రజలకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిం ది. ఐదు రాష్ర్టాల ఎన్నికల ప్రచారంలో గ్యాస్, పెట్రోల్,డీజిల్ ధరలు పెంచే ప్రసక్తి లేదని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పోలింగ్ ముగిసిన వెంటనే వాణిజ్య గ్యాస్ ధరను భారీ గా పెంచి ప్రజలను ఆందోళనకు గురి చేసింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,345 ఉండగా, ప్రస్తుతం వెయ్యి రూపాయలు పెంచారు.
జిల్లాలో వాణిజ్య సిలిండర్ ధర రూ.3,350కు డెలివరీ చేస్తున్నారు. ఓ పక్క పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో కుదేలవుతున్న ప్రజలపై మరోపక్క మోదీ సర్కారు గ్యాస్ సిలిండర్ రూపంలో భారీ పిడుగు వేసింది. 45 రోజుల కిందట గృహ అవసరాలకు వినియోగించే (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.60 పెంచి పేదల నడ్డి విరిచింది. ఇప్పుడు వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెంచటంతో సిద్దిపేట జిల్లా ప్రజలపై దాదాపు రూ.3 కోట్ల అదనపు భారం పడనుంది.
వాణిజ్య ఎల్పీజీ ధర గడిచిన ఐదు నెలల్లో రికార్డు స్థాయిలో రూ.1500 పెరిగింది. మార్చి 1న రూ.28 పెంచగా, మళ్లీ మార్చి 7న రూ.115 పెంచింది. నెల రోజులుగా జిల్లాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ సరఫరా లేక బ్లాక్లో కొనుగోలు చేసి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా రూ.933 పెంచింది. పెరిగిన గ్యాస్ ధర వల్ల చిరువ్యాపారులకు ఖర్చులు పెరిగాయి.
సిద్దిపేట జిల్లాలో 1038 కమర్షియల్ (వాణిజ్య) గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర రూ. 933 పెంచడంతో రోజుకు జిల్లాలో చిరు వ్యాపారులపై రూ.10 లక్షలకు పైగా అదనపు భారం పడనున్నది. సిద్దిపేటతో పాటు దుబ్బాక, గజ్వేల్, చేర్యాల్, హుస్నాబాద్ మున్సిపాలిటీ పట్టణాల్లో హోటళ్లతో పాటు టిఫిన్ సెంట ర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు , టీ స్టాళ్లు అధికంగా ఉన్నాయి. మండల కేంద్రాలు , మేజర్ గ్రామ పంచాయతీల్లో వాణిజ్య గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. చిన్నపాటి మొబైల్ టిఫిన్ సెంటర్, టీ స్టాళ్లకు రెండు రోజులకు ఒకటి చొప్పున 19 కిలోల వాణిజ్య సిలిండర్ వినియోగిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు తదితర వాటిలో గ్యాస్ వినియోగం అధికంగా ఉంటుంది.
వాటిలో రోజుకు 2 లేదా 3 వాణిజ్య సిలిండర్లు వినియోగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మోదీ సర్కారు వాణిజ్య సిలిండర్ ధర పెంచడంతో చిరువ్యాపారులు, హోటళ్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం అత్యధికంగా ఉంది. జిల్లాలో 3.12 లక్షల మందికి (డొమెస్టిక్) గృహ అవసరాల కోసం గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు గృహ అవసరాలకు సుమారు 17 వందల టన్నుల గ్యాస్ వినియోగిస్తున్నారు. ఇటీవల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 60 పెంచడంతో సిద్దిపేట జిల్లా ప్రజలపై సుమా రు రూ.1.90 కోట్ల భారం పడింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను విపరీతంగా పెంచి మోదీ సర్కారు ప్రజలపై పెనుభారం మోపగా, ఆరు గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ సర్కారు రూ.500లకే గ్యాస్ సిలిండర్ హామీ అమలుకు నోచుకోవడం లేదు.
మోదీ సర్కారు పేదలను ఇబ్బందులకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నది. వాణిజ్య సిలిండర్ల కొరతతో చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిలిండర్లు దొరకక టిఫిన్ సెంటర్లతో పాటు హోటళ్లు మూసివేయాల్సి వచ్చింది. ఇప్పుడు కేంద్రం కమర్షియల్ సిలిండర్పై రూ.వెయ్యి రూపాయలు పెంచి ఆందోళనకు గురి చేసింది. చిరువ్యాపారులను ఆదుకోవాల్సింది పోయి ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా కేంద్రం దృష్టి పెట్టింది.
– సత్యానందం, మొబైల్ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, దుబ్బాక (సిద్దిపేట జిల్లా)
మిరుదొడ్డి, మే 2: మిరుదొడ్డి టౌన్లో పానీపూరి బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. వ్యాపారం చేయడం ఇబ్బందిగా మారింది. పానీపూరి పదార్థాలు తయారు చేయడానికి గ్యాస్ సిలిండర్ సమయానికి అందక కట్టెల పొయ్యి మీదనే వివిధ రకాల తినుబండారాలు తయారు చేస్తున్నా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అలాలేదు.
-కంది ఎల్లం, పానీ పూరి వ్యాపారి, కాసులాబాద్, మిరుదొడ్డి (సిద్దిపేట జిల్లా)