నారాయణఖేడ్, ఏప్రిల్ 14: ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో శిక్ష తప్పదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఈనెల 16న అందోల్ నియోజకవర్గం సుల్తాన్పూర్ వద్ద నిర్వహించనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో ఆదివారం నారాయణఖేడ్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో కోత పెడుతుందన్నారు.
బీజేపీ ప్రకటించిన మ్యానిఫెస్టో పేదలు, రైతులకు ఏమాత్రం మేలు చేసే విధంగా లేదన్నారు. రాష్ట్రంలో ఎస్సీలకు కేటాయించిన మూడు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా మాదిగ అభ్యర్థిని నిలబెట్టలేదన్నారు. జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ను బీఆర్ఎస్ రెండుసార్లు ఎంపీగా అవకాశం కల్పిస్తే మోసం చేసి బీజేపీలో చేరారని, ఓటుతో ప్రజలు బుద్ధి చెపాలన్నారు. గురుకులాలు, మార్కెట్యార్డు, రోడ్లు, సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి ‘ఖేడ్’ నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మార్చామన్నారు. కారు గుర్తుకు ఓటువేసి గాలి అనిల్కుమార్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. కేసీఆర్ సభకు 20వేల మంది జనసమీకరణ చేయాలనే లక్ష్యంతో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా నాయకులు మఠం భిక్షపతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.